ఎడిటోరియల్: ఆయేషా మీరా రేప్‌ కేసు.. ఏ పార్టీకి నష్టం చేకూరుస్తుంది..?

Chakravarthi Kalyan
సరిగ్గా 11 ఏళ్ల క్రితం.. ఇబ్రహీం పట్నంలోని ఓ లేడీ హాస్టల్.. ఉదయం హాస్టల్‌లో లేచిన విద్యార్థినుల గుండెలు అదిరాయి. తమతో పాటు హాస్టల్‌లో ఉంటూ బీ ఫార్మసీ చదువుకుంటున్న ఆయేషా మీరా.. హత్య చేయబడి బాత్‌ రూమ్‌లో శవంగా మారింది. ఒంటిపై నూలుపోగు లేదు. చూడగానే అది అత్యాచారం చేసి చేసి హత్యగా ఇట్టే తెలిసిపోతుంది. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.



అప్పుడప్పుడే జోరందుకుంటున్న తెలుగు న్యూస్ ఛానల్స్ ఆయేషా మీరా హత్య కేసు విషయంలో చాలా హడావిడి చేశాయి. హాస్టల్‌లో ఓ అమ్మాయిని అత్యాచారం చేసి చంపేసి.. ఆ శవాన్ని బరాబరా ఈడ్చుకెళ్లి బాత్రూమ్‌లో పడేసి హంతకుడు తాపీగా వెళ్లిపోయినా పక్కన ఉంటున్న అమ్మాయిలకు ఆ సంగతి తెలియకపోవడం విశేషం. పోలీసులకు సవాలుగా మారిన ఈ కేసు విచారణ సుదీర్ఘంగా సాగింది.


హత్య విషయం వెలుగు చూసిన తొలి రోజుల్లో అనుమానం అప్పటి మంత్రి కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీశ్ వైపు మల్లింది. ఆయనే ఆయేషాను రేప్ చేసి చంపేశాడని వార్తలు వచ్చాయి. కానీ ఆయన మంత్రి గారి మనవడు కావడం వల్లే పోలీసులు సరైన చర్య తీసుకోలేదని.. పై నుంచి చాలా వత్తిళ్లు వచ్చాయని ఆరోపణలొచ్చాయి. ఈ అంశంపై సిట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఆ సిట్ విచారణలో చివరకు కోనేరు సతీశ్‌ ను నిర్దోషిగా తేల్చారు పోలీసులు.



అదే ప్రాంతంలో నివసించి గతంలో దొంగతనాలు చేసిన సత్యంబాబు అనే యువకుడే ఆయేషా మీరాను రేప్ చేసి చంపాడని పోలీసులు తేల్చి చెప్పారు. నాకేం తెలియదు మొర్రో అని సత్యంబాబు, అతని తల్లి మరియమ్మ మొత్తుకుంటున్నా పోలీసులు పట్టించుకోలేదు. అసహాయుడైన సత్యంబాబును ఇందులో ఇరికించారన్న ఆరోపణలూ వచ్చాయి. సుదీర్ఘ విచారణ తర్వాత సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా తేల్చింది.


ఆయేషాను హత్య చేశాడని భావించిన సత్యంబాబు నిర్దోషిగా విడుదలయ్యాడు. తొలి అనుమానితుడు కోనేరు సతీశ్ తనకే పాపం తెలియదంటున్నాడు. మరి ఆయేషా ను చంపిందెవరు.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి తీరాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. సీబీఐ అధికారులతో మళ్లీ కేసును పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు ఆయేషా మీరా కేసు మళ్లీ మొదటికి వచ్చింది.


ఇప్పుడు మరోసారి ఆయేషా కేసులో విచారణ మొదలైంది. కానీ ఈసారి కేసు చేధించేది సీబీఐ పోలీసులు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు సతీష్ ను సీబీఐ అధికారులు తాజాగా విచారించారు. సతీష్ ఇంటి నుంచి హార్డ్ డిస్క్, సీడీ, డైరీలు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇల్లంతా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సీబీఐ అధికారులు 11 యేళ్ల పాటు బ్యాంక్ లావాదేవీలు సేకరించారు. తాళం లేని బీరువాలను పగలకొట్టి మరీ వెతికారు.


తానేం నేరం చేయలేదని..తన తాతగారిని రాజకీయంగా దెబ్బ తీసేందుకు తన పేరును వాడుకున్నారన్నది కోనేరు సతీష్ వాదన. అవసరమైతే నార్కో అనాలసిస్ పరీక్షకైనా సిద్ధమని చెబుతున్నాడు. సీబీఐ కేసు విచారణలో భాగంగా సత్యంబాబును కూడా ప్రశ్నించింది. సత్యం ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. హత్య జరిగిన రోజు సత్యంబాబు, కోనేరు సతీశ్ ఎక్కడ ఉన్నారు? ఏం చేశారనే కోణంలో సీబీఐ అధికారులు సత్యం బాబును విచారించినట్లు తెలుస్తోంది .




మరి సీబీఐ విచారణలోనైనా వాస్తవాలు వెలుగు చూస్తాయా.. హంతకుడికి శిక్ష పడుతుందా..అన్నది తేలాల్సి ఉంది. ఆయేషా మీరా హత్య కేసు విచారణ రాజకీయ పార్టీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న కోణం కూడా ఉంది. ఎన్నికల్లోపు ఈ కేసును సీబీఐ చేధంచగలిగితే.. అది చంద్రబాబు సర్కారుకు ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ ఇంతటి క్లిష్టమైన కేసు అంత సులభంగా చిక్కుముడి వీడటం కష్టమే. మరి సీబీఐ ఏం తేలుస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: