ఏపీ బీజేపీకి భారీ షాక్ తగలబోతోంది. దశాబ్దాల తరబడి రాజకీయాల్లో కీలకంగా ఉన్న సీనియర్ పార్లమెంటిరియన్, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని భోగట్టా. అయిదేళ్ళ క్రితం వరకూ కాంగ్రెస్ లో ఉన్న కావూరి విభజన వల్ల తప్పనిసరి పరిస్తితుల్లో మరో జాతీయ పార్టీగా బీజెపీలో చేరిన సంగతి విధితమే.
జగన్ పార్టీలోకి :
ఇక కావూరి వైసీపీలో చేరడానికి దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని టాక్. ఆయన రెండు మూడు రోజుల్లో జగన్ని కలసి తన అభిమతాన్ని చెబుతారని అంటున్నారు. కావూరి వంటి సీనియర్ రాక వల్ల వైసీపీకి పశ్చిమ గోదావరి జిల్లాలో మరింతగా బలం పెరగబోతోంది. కావూరితో పాటు ఆయన అనుచర గణం కూడా పార్టీలోకి వస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా కావూరితో జగన్ తరఫున ప్రశాంత్ కిషోర్ చర్చలు జరిపారని తెలుస్తోంది. తాను పార్టీ మారడంపై కావూరి ఖండించకపోవడం ఇక్కడ విశేషం.
ఏలూరి ఎంపీగా :
ఇక కావూరి సాంబశివరావు ఎలూరు ఎంపీగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని అంటున్నారు. ఆయన గతంలో ఇదే సీటు నుంచి అనేక మార్లు గెలిచారు. సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఎంతో మంది శిష్య ప్రశిష్యులను కూడా తయారు చేసుకున్నారు. కావూరి వంటి ఉద్దండులు పార్టీలో చేరడంతో ఏపీలో అధికారంలోకి వచ్చేది వైసీపీయేనని కచ్చితంగా చెప్పొచ్చంటున్నారు. మొత్తానికి గోదావరి జిల్లాలు సైతం వైసీపీ వైపుగా టర్న్ తీసుకుంటున్నాయి.