తెలుగుదేశం పార్టీ నేతలంటే అస్సలు ఏమాత్రం ఇంగితఙ్జానం లేకుండా మాట్లాడాల్సిందేనేమో! అలా ఆ పార్టి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పార్టీకే ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని రచించి అమలు చేస్తున్నారేమో! లేకపోతే, మేధావులు కూడా తెలుగుదేశం పార్టీ జెండా ధరించగానే ఇంగితఙ్జానం కోల్పోతారు ఎందుకని? రాజకీయాల్లో రాజకీయ విమర్శలు సర్వసాధాణం. విమర్శలు లేని రాజకీయాల్ని ఊహించలేం. కానీ, మరీ అస్సలు ఏమాత్రం ఇంగితఙ్జానం లేకుండా మాట్లాడితే ఎలా? విద్యావంతుడు, పెద్దమనిషిగా కనిపించే కనకమేడల రవీంద్ర కుమార్ కూడా ఇంగితం కోల్పోయి మాట్లాడుతోంటే, అంతా ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది.
పెద్దమనిషి అవటానికి అర్హత రాజ్యసభకు ఎంపిక అవటం మాత్రమే అనుకుంటే ఎలా? కానీ, కనకమేడల రవీంద్ర కుమార్ పరిస్థితి వేరు. ఆయన ఉన్నత చదువులు చదువుకున్నారు. పైగా, న్యాయవ్యవస్థపై కావలసినంత అవగాహన వుంది. ఇంకా చాలా చాలా 'ఘనతలు-ప్రత్యేకతలు' ఆయన పేరిటవున్నాయి. అయినా గానీ, టీడీపీ తరఫున మాట్లాడుతున్నారు కాబట్టి, ఇంగిత ఙ్జానం కోల్పోవాల్సిందే.
లేకపోతే, కాగ్ - కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలో, వైసిపి శాసనసభ్యుడు విజయసాయిరెడ్డి పాత్ర వుందని ఆయన ఎలా అనగలుగుతారు? కాగ్ అంటే ఆషామాషీ సంస్థ కాదు. దానికో పెద్ద తతంగం వుంటుంది. దేశంలో ఇప్పటిదాకా క్లీన్ గా వున్న వ్యవస్థ ఏదంటే? ఠక్కున అందరూ చెప్పేది కాగ్ గురించే. అఫ్-కోర్స్ అలాంటి కాగ్ ఇప్పుడు అనేక విమర్శల్ని ఎదుర్కొంటోందనుకోండి. అది వేరే విషయం. రాఫెల్ డీల్ విషయంలో కాగ్ తాజా నివేదిక కారణంగానే దానిపై ఈ బురద చిందులు.
కేంద్ర ప్రభుత్వానికి అందుబాటులో అనేక మంది ఆడిటర్లుంటారు. మేధావులుంటారు. ఆర్థిక వేత్తలు అందుబాటులో వుంటారు. కాగ్ నివేదికని కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ట్యాంపరింగ్ చేసిందనే అనుకున్నా, దాని కోసం విజయసాయి రెడ్డి సహాయాన్ని ఆశిస్తారా? అంతకన్నా హాస్యాస్పదం ఇంకేమన్నా వుంటుందా? టీడీపీ నుంచి వైసిపి లోకి వలసలు జోరందుకుంటున్న దరిమిలా, టీడీపీ నేతలకు మతి భ్రమిస్తున్నట్లుంది. అంతే మరి, లేకపోతే మరీ ఇంతలా ఇంగితఙ్జాన మెలా కోల్పోతారట.!
నాలుగేళ్ళ పాటు టీడీపీ-బీజేపీ అంటకాగాయి. ఈ సమయంలో కాగ్ మీద తెలుగుదేశం పార్టీ పెత్తనం చేయడమో, టీడీపీ మేధావులు కాగ్ లోకి చొరబడి ట్యాంపరింగ్ చేయడమో సాధ్యం చేసిందన్నట్టుంది టిడిపి శాసనసభ్యుడు ఇంగితఙ్జానం అత్యధికంగా ఉన్న రవీంద్ర కుమ్మర్ చౌదరి వ్యవహారం.