ఓటర్ కు ఉరేసే బాధ్యత ఐటి గ్రిడ్స్ తీసుకుందా!

ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు తమ రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం ఏలా చేరవేసింది, దానిని ఏలా దుర్వినియోగం చేస్తున్నది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ డయాగ్రమాటిక్గా వివరించిన తీరు ఆసక్తిదాయకంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. "సేవా మిత్ర యాప్" అనేది పూర్తిగా తెలుగుదేశం పాఋఈకి చెందినది. అలాంటి ప్రయివేట్ వ్యవ్స్థకు ప్రభుత్వం వద్ద ఉండవలసిన "సున్నిత విలువైన ప్రజా సమాచారం" "బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీస్" అనే ఆర్వోసీ లో రిజిస్టర్ కాని కంపెనీకి చెరటం - ఆతరవాత చిక్కటం అక్కడ నుంచి మరో ప్రైవేట్ కంపనీ ఐటి గ్రిడ్ కు చేరటం వారి విశ్లేషణ తర్వాత, అక్కడ నుంచి "కీ పర్సన్" అనబడే ఎవరికీ తెలియని వ్యక్తికి (ఎవరైనా కావచ్చు - ఏ విదేశీ శక్తైనా కాకూడదా!)కి, తిరిగి "సేవామిత్ర యాప్"కు, సూపర్వైజర్ కు - అనంతరం వేరే పార్టీ వారి ఓట్లను తొలగిస్తున్న తీరును ఆయన చక్కగా వివరించారు. 

ప్రజా సమాచారం ఈ తీరున ప్రజలకు చెందని వ్యక్తుల చేతుల్లో పడి ఎటు నుండి ఎటు వెళ్ళిపోయిందో? అవగాహన కాని పరిస్థితుల్లో పడిపోవటం జాతికి కీడే! ముఖ్య మంత్రిగా ప్రమాణం చేసిన వ్యక్తి ఏ సమాచారాన్నైనా అతి జాగ్రత్తగా కాపాడతానని ప్రమాణపత్రం చదివినప్పుడు శపథం చెసే ఉంటారు. అలాంటి ప్రభుత్వ అధినేతైన వ్యక్తి ప్రజా సమాచారాన్ని అధీకృతంకాని వారి చెతుల్లో గాలికి వదిలిన దీపశిఖలా వదిలేస్తే జాతి పరిస్థితి ఏమిటి. ప్రజలను భద్రత ప్రాముఖ్యంగా పనిచేయవలసిన ప్రభుత్వం - ప్రజా సమాచారాన్ని ఇంతగా తన పార్టీ - తన ఎన్నికల - తన అధికార ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయటం క్షమించరాని దేశ ద్రోహం. ఒక వేళ తప్పు వైసిపి దైనా ప్రభుత్వం గా తన విధి తాను నిర్వర్తించలేనప్పుడు ఆ పదవికి రాజీనామా చేసి జాతికి క్షమాపణ చెప్పటం కొంతైనా మంచిది. అలా కాకుండా నేపం వేరేవారిపై నెట్టేసి ఇంకా బుకాయించటం దేశద్రోహ సమానం. అంతేకాదు ఆ నేర పరిశోధన చేస్తున్న పోలీస్ లకు చెందిన రాష్ట్ర ప్రభుత్వం పై కాలుదువ్వటం కేసు పెట్టటం మరింత తెగించిన నేరం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయం ప్రకారం ప్రవర్తిస్తే మంచిది. 

సేవామిత్ర యాప్‌ లో కేవలం తెలుగుదేశం పార్టీ వారికి చెందిన వివరాలు మాత్రమే ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెప్పడంలో వాస్తవం లేదు. ఒక ఓటరు, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం లేదా ఇంకే ఇతర పార్టీల్లో ఎవరికి ప్రాధాన్యం ఇస్తున్నాడు? అనేది తెలుసుకుని యాప్‌ లో పొందుపరుస్తున్నారు. ఆయా పార్టీకి రేటింగ్స్‌ కూడా ఇస్తూ డేటాబేస్‌ రూపొందించారు. 

ఐటీ గ్రిడ్స్‌కు చెందిన సేవామిత్ర యాప్‌ ద్వారా తెలుగుదేశం పార్టీ తమ వ్యతిరేక ఓటర్లను తొలగించి రానున్న ఎన్నికల్లో అక్రమ లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తోందంటూ ఫిర్యాదుదారుడు పేర్కొన్న అంశాలన్నీ "వాస్తవమే" అని పోలీసులు ఇందుమూలంగా ఆధారలతో తేల్చారు.

ఈ యాప్‌ను అడ్డం పెట్టుకుని టీడీపీ వారు ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో ఉండని, తమ పార్టీకి ఓటు వేయరని భావించిన వారి ఓట్లను వారి ప్రమేయం లేకుండానే తొలగిస్తున్నారు. సేవా మిత్ర యాప్‌ లో ఉన్నది తెలుగుదేశం పార్టీ డేటా మాత్రమే అన్నది వాస్తవం కాదు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అనేక మంది విద్య, వృత్తి, వ్యాపారాల కోసం హైదరాబాద్‌ కు వస్తున్నారు. అలాంటి వారి ఓట్లను కూడా, వారి ప్రమేయం లేకుండానే తీసేశారు. దీనిపై ఎన్నికల సంఘం నుంచి వివరాలు, మార్గదర్శకాలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు.

అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అతిపెద్ద వివాదంగా మారిపోయిన డేటాచోరీ విషయం రోజురోజుకు పెను భూతంలాగా మారిపోతోంది. ఏపీలో విపక్షం వైసీపీ చేసిన ఫిర్యాదుతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్ - ఏపీలోని అధికార పార్టీ టీడీపీ ల మధ్య భీకర రాజకీయ యుద్ధంగా మారిపోయింది. ఈ కేసు దర్యాప్తు సాగుతున్న తీరు-ఒక రాష్ట్రంపై మరో రాష్ట్ర పోలీసు కేసులు పెట్టుకునే వరకు వచ్చింది కేసులు పెట్తుకున్నారు కూడా! ఈ వైనం చూస్తుంటే, ఈ వివాదం ఏ పార్టీ కొంప ముంచుతుందో అన్నట్లు వైరల్ గా మారిపోయింది. 

కేసు మూలాలు పెద్దగా మాట్లాడని టీఆర్ఎస్ - టీడీపీ నేతలు, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మూడు రోజుల క్రితం మొదలైన ఈ సమరం పోలీసుల పరిధిని దాటి ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారి తలుపు తట్టింది. ఇంతలా అందరి నోట నానుతున్న ఈ కేసు అసలు గుట్టు ఇప్పటిదాకా ఏ ఒక్కరికీ స్పష్టంగా తెలియదనే చెప్పాలి. ఇక కలియుగ నారదులైన మీడియా సంస్థలు - వారి వారి పార్టీలకు మద్దతుగా ఈ అంశాన్ని మార్పుచేస్తూ వార్తలు వండి వారుస్తూ ప్రజలకు సమాచారంగా వడ్డించేస్తున్నాయి. 

అసలు కేసు మూలాలేమిటి? అన్నది గ్రహించట్లేదు. అయితే నిన్న ఈ కేసు వివరాలను వెల్లడించేందుకు మీడియా ముందుకు వచ్చిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, ఈ కేసు పూర్తి పాఠంతో మొత్తం గుట్టును విప్పే ప్రయత్నం చేశారు. ఈ రకంగా ఈ కేసు అసలు గుట్టు ఏమిటన్న విషయం తెలిసిన వారు, చూడ్డానికి అంతగా అర్థం కాకుండా సాగుతున్న డేటాచోరీలో ఇంత పెద్ద మాయ ఉందా? అని నోరెళ్లబెట్టక తప్పని పరిస్థితి. ఇక ఈ కేసు అసలు రహస్యం ఏమిటన్న విషయానికి వస్తే, కేసులో టీడీపీకి సాంకేతిక సహకారం అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న "ఐటీ గ్రిడ్" సంస్థే ఈ మొత్తం వ్యవహారంలో కీలకమని చెప్పాలి. 


చాలా కాలం క్రితం నుంచే ఐటీ గ్రిడ్ సంస్థ టీడీపీకి అనుబంధంగా పనిచేస్తున్నా, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరుసగా కొందరి ఓట్ల గల్లంతు కావడం - పోలీసులకు ఫిర్యాదులు చేరడంతో ఈ కేసులో ఐటీగ్రిడ్ ప్రధాన నిందితునిగా చెప్పక తప్పదు. ఇది చెసే పనిని హైదరాబాద్ సిపి వివరించిన డయాగ్రమ్ ప్రకారం: 
టీడీపీ సేవా మిత్ర పేరిట ఒక యాప్ అభివృద్ధి చేసింది. ఈ యాప్ అభివృద్ధి చేసిన సంస్థ కూడా ఐటీ గ్రిడ్డే. ఈ యాప్ ద్వారా ఓటర్లకు సంబంధించిన సమగ్ర వివరాలను సేకరించడం తో - ఆ వివరాలను భద్రపరచడం - అవసరమైన డేటాను టీడీపీకి పంపడం - టీడీపీ ఇచ్చిన సమాచారం మేరకు ఓటర్లను విచారించడం - వారికి సంబంధించి మరిన్ని వివరాలను సేకరించడం - తిరిగి ఆ సమాచారాన్ని టీడీపీ కి పంపడం - పార్టీలో ఈ వ్యవహారానికి సంబంధించిన "కీలక వ్యక్తి" ఇచ్చే ఆదేశాల మేరకు, అంతిమంగా "మరో ఓటరు జాబితా" ను చేతిలో పెట్టుకున్న వ్యక్తికి ఈ సమాచారాన్ని పంపడం - ఐటీ గ్రిడ్ ప్రధాన విధులు.
ఈ వరుస క్రమం ఎలా సాగుతుందన్న విషయానికి వస్తే: 


  • "సేవా మిత్ర యాప్" తో అనుసంధానం అయి ఉన్న 'టీడీపీ బూత్ లెవెల్ సేవా మిత్ర కన్వీనర్' నుంచి కొంత సమాచారం ముందుగా ఐటీ గ్రిడ్ కు చేరుతుంది. 
  • ఆ సమాచారంలోని వ్యక్తులను ఫోన్ ద్వారా పలకరించి ఆయా వ్యక్తులకు సంబంధించి మరిన్ని సమగ్ర వివరాలను ఐటీ గ్రిడ్ సేకరిస్తుంది. 
  • ఈ సందర్భంగా సదరు వ్యక్తులనుండి ప్రశ్నావళి ద్వారా సేకరించే సమాధానాలు "రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారు"  అనే కీలక ప్రశ్న కూడా ఉంటుంది.
  • ఈ సర్వే ముగిసిన అనంతరం "బూత్ లెవెల్ టీడీపీ సేవా మిత్ర కన్వీనర్" ఇచ్చిన సమాచారంతో పాటుగా తన సర్వేలో సేకరించిన వివరాల సమాచారాన్ని ఐటీ గ్రిడ్ సేకరిస్తుంది. 
  • ఈ సమాచారాన్ని టీడీపీ కేంద్రకార్యాలయానికి పంపడంతో పాటుగా-తనకు ఎవరైతే ప్రాథమిక వివరాలు అందించారో-అదే  "బూత్ లెవెల్ టీడీపీ సేవా మిత్ర కన్వీనర్" కు కూడా అదే సమాచారం ఐటీ గ్రిడ్ పంపుతుంది. 
  • ఈ వివరాలను చేతబట్టుకుని కార్యరంగంలోకి దిగే "బూత్ లెవెల్ టీడీపీ సేవా మిత్ర కన్వీనర్" తాను ఎంచుకున్న వ్యక్తుల నుంచి ఆధార్ - ఓటరు ఐడీ - ఫోన్ నెంబరు - వారి కులం - తదితర వివరాలను సేకరిస్తారు.
  • ఈ సేకరణలో ఆ ఓటరు సామాజిక వర్గం వివరాలు కూడా సేకరించి ఆ వివరాలను "బూత్ లెవెల్ టీడీపీ సేవా మిత్ర కన్వీనర్" తిరిగి ఐటీ గ్రిడ్ కు పంపుతారు. ఈ సమాచార సంగ్రహం - ఐటీ గ్రిడ్ సమగ్ర డేటా ను టీడీపీ లోని "కీలక స్థానంలో కూర్చున్న వ్యక్తి" అదే "కీలక వ్యక్తి" (కోడ్ గా వాడబడింది) పంపుతుంది.
  • దీనిని పరిశీలించిన తర్వాత ఆ ఓటరు ఈ సారి తమకు ఓటేయరని నిర్ధారించే సదరు "కీలక వ్యక్తి" ఓటరు జాబితా తో ఎళ్లవేళలా సిద్ధంగా ఉండే అధికారికి పంపుతారు. ఇక అంతే, "ఆ ఓటరు పేరు ఓటరు జాబితా నుంచి తొలగించబడుతుంది" డిలీట్ అయిపోతుంది. ఇదీ మొత్తంగా ఐటీ గ్రిడ్ కేంద్రంగా జరుగుతున్న ప్రజాస్వామ్యానికి హానికలిగించే తతంగంగా భావిస్తున్నారు.

అంటే "బూత్ లెవెల్ టీడీపీ సేవా మిత్ర కన్వీనర్" నుంచి ప్రారంభమయ్యే ఈ తతంగ క్రమం "ఐటీ గ్రిడ్ ప్రధాన కేంద్రం" గా వివిధ మార్గాల్లో అనేక విశ్లేషణల తర్వాత పార్టీలో "కీలక వ్యక్తి" అని ఉదహరించిన నేతకు చేరుతుంది ఆతరవాత తమకు ఓటేస్తారని భావించే ఓటరుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు. కాని తమకు ఓటేయరని నిర్ధారించబడ్డ వారి ఓట్లు మాత్రం అప్పటి కప్పుడు ఓటర్ల జాబితా నుండి గల్లంతైపోతున్నాయన్నది యధార్ధం. డేటాచోరీ అంటూ నాలుగు అక్షరాల మాట వెనుక  ఇంత పెద్ద రాజకీయ తతంగం నడుస్తూ - ఓటరే కీలకమైన ప్రజాస్వామ్య మూలాలకు చీడ పట్టిస్తుందన్న మాట. దట్స్ ఇట్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: