హైదరాబాద్లో మరోమారు అక్రమ నగదు కలకలం సృష్టించింది. సినీనటుడు, తెలుగుదేశం పార్టీకి చెందిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మురళీమోహన్ కోడలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు ఆయన సంస్థ అయిన జయభేరీ మేనేజర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని మాదాపూర్లో గల జయభేరి అపార్ట్మెంట్లో కారులో రూ. 2 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. నగదు ఏపీలోని ఓ రాజకీయనేతకు చెందినదిగా పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి రాజమండ్రికి అక్రమంగా డబ్బు తీసుకు వెళుతున్నట్లు అందిన పక్కా సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రిలోని ఒక రాజకీయ నాయకుడికి డబ్బులు అందించేందుకు వెళ్తున్నట్లు వారు తెలిపారు. రెండు కోట్ల రూపాయలని ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంపీగా పోటీ చేస్తున్న ఒక నాయకుడు చెందిన డబ్బు గా గుర్తించిన పోలీసులు వెల్లడించారు.
కాగా, ఏపీలో భారీగా డబ్బు వెదజల్లేందుకు అధికార తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో డబ్బును కుమ్మరించి గెలుపొందాలనేది టీడీపీ ఎత్తుగడ అని వస్తున్న ఆరోపణలు నిజం చేస్తూ....తాజాగా టీడీపీ ఎంపీకి చెందిన మొత్తం దొరకడటం సంచలనంగా మారింది.