సరిగ్గా ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. బోండా ఉమామహేశ్వరరావు పై కేసు నమోదు చేయాలని ఏపీ హై కోర్టు ఆదేశించింది. ఓ పాత కేసు సరిగ్గా ఎన్నకల సమయంలో బోండా ఉమ మెడకు చుట్టుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తన కుమార్తె సాయిశ్రీ మరణానికి కారణం.. భర్త మాదంశెట్టి శివకుమార్, ఎమ్మెల్యే బోండాఉమా మహేశ్వరరావు, అతని అనుచరులే కారణం అంటూ 2017 ఏప్రియల్ లో సుమశ్రీ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో అధికార పార్టీ ఒత్తిడులకు తలొగ్గిన పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో బాధితురాలి హైకోర్టును ఆశ్రయించింది.
కేసును విచారించిన హైకోర్టు బోండా ఉమాపై కేసు నమోదు చేయాలని ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ కాపీ సరిగ్గా పోలింగ్ కు ముందు రోజుల్లో అందడంతో ఉమా చిక్కుల్లోపడ్డారు. ఆర్డర్ కాపీతో సుమశ్రీ విజయవాడ పోలీస్ కమిషనర్ ను కలిసారు. ఆయన సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ కు కేసు రిఫర్ చేశారు.
అయితే ఇప్పటికీ పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నారని బాధితురాలు చెబుతున్నారు. సుమన శ్రీ పోలీస్ స్టేషన్ కు వచ్చినా.. సిఐ అందుబాటులో లేరని సిబ్బంది చెప్పారు. హైకోర్టు ఆర్డర్ ఉన్నా, కేసు నమోదులో పోలీసులు జాప్యం చేస్తున్నారని సుమన శ్రీ వాపోయారు. మాదంశెట్టి శివకుమార్, బోండా ఉమామహేశ్వరరావు వల్ల తనకు ప్రాణ హని ఉందని బాధితురాలు సునశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసు ప్రభావం ఎన్నికల పైనా పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.