పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారుతున్న సంగతి తెలిసిందే. పోలింగ్ గడువు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీలు తమదైన శైలిలో విమర్శలు సందిస్తున్నాయి. ఇక్కడి పోరులో అందరి చూపు మండ్య నియోజకవర్గంపై పడింది. దివంగత కన్నడ స్టార్ అంబరీష్ సతీమణి, నటి సుమలత ఇక్కడి నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. జేడీఎస్ తరుపున ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. హోరాహోరీ పోరు జరుగుతున్న నేపథ్యంలో సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు జేడీఎస్ కష్టపడాల్సి వస్తోంది.
మండ్య గతంలో జేడీఎస్ కంచుకోట. అయితే, సుమలతపై సానుభూతి పెల్లుబికే అవకాశం కనిపిస్తుంది. పలువురు సినీ నటులు నుంచి సుమలతకు మద్దతు లభిస్తుంది. ఇప్పటికే కన్నడ స్టార్ హీరో యశ్ సుమలతకు బాసట నిలిచిన విషయం తెలిసిందే. మరోవైపు ఇటీవలే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే నిఖిల్ తరుపున అక్కడ ప్రచారం నిర్వహించారు. చంద్రబాబుతో ప్రచారం ద్వారా అక్కడి తెలుగువారిని జేడీఎస్ వైపు ఆకర్షించవచ్చునని కుమారస్వామి భావించారు. అయితే, చంద్రబాబు ప్రచారంపై వైసీపీ నేత, సినీ నటుడు మోహన్ బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ ఎన్నికల్లో డబ్బు, కుల రాజకీయాలను పక్కనపెట్టి మండ్య ప్రజలు సుమలతను గెలిపించాలని మోహన్బాబు పిలుపునిచ్చారు. మండ్య రాజకీయంపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఒకప్పుడు అంబరీష్ను చంద్రబాబు తన ద్వారా ఎన్నో కార్యక్రమాలకు పిలిపించారని.. అలాంటి చంద్రబాబు ఇప్పుడు ఆయన భార్యకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు కనీస కృతజ్ఞతాభావం లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు ఆమెకు మద్ధతు తెలుపకపోగా… వ్యతిరేకంగా ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు.