ఎడిటోరియల్ : పార్టీ అంతా ఒకవైపు..చంద్రబాబు ఒక్కళ్ళు మరోవైపు
అలాగే ఉంది తెలుగుదేశంలో
పరిస్ధితి చూస్తుంటే. ఈ పరిస్ధితి టికెట్లు ఇచ్చే సమయంలోనే కనబడినా ఇపుడు మాత్రం
స్పష్టంగా తెలిసిపోతోంది. టికెట్లు
ఇచ్చేటప్పుడే చాలామందికి ఇష్టం లేకపోయినా, సర్వేల్లో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినా
సదరు నేతలకే టికెట్లు ఇవ్వక తప్పలేదు చంద్రబాబుకు. సరే దానికి అనేక కారణాలు
ఉన్నాయి లేండి. అయినా అది చరిత్రలో కలిసిపోయింది కాబట్టి ఇపుడు ఆ ప్రస్తావన అవసరం
లేదు.
పోలింగ్ జరిగన దగ్గర నుండి పార్టీ నేతల్లో చాలామందిది ఒకమాటగా చెలామణిలో ఉంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు మాట మాత్రం మరోమాటగా వినిపిస్తోంది. విషయం ఏమిటంటే, రేపటి గెలుపుపై చాలామంది నేతల్లో నమ్మకం లేదు. జిల్లాల నుండి అందుతున్న ఫీడ్ బ్యాక్ ప్రకారం, నేతల అంతరంగిక సంభాషణల ప్రకారమైతే టిడిపి ప్రతిపక్షంలో కూర్చోక తప్పదు.
అయితే చంద్రబాబు మాట మాత్రం మరో రకంగా ఉంటోంది. రేపటి ఫలితాల్లో టిడిపికి రాబోయేది 130 సీట్లని పదే పదే చెబుతున్నారు. టెలికాన్ఫరెన్సులే కాకుండా నేతలతో జరుపుతున్న సమీక్షల్లో కూడా అదే మాట చెబుతున్నారు. ఎవరైనా పార్టీలో జరుగుతున్న చర్చ, క్షేత్రస్ధాయిలో జరిగిన విషయాలు, తమ నియోజకవర్గాల్లోని ఫీడ్ బ్యాక్ చెబుతున్నా చంద్రబాబు పట్టించుకోవటం లేదు. పైగా వారిని సాంతం చెప్పనీయటం లేదు.
చంద్రబాబు మనోగతం అర్ధమైపోయిన తర్వాత నేతలు కూడా వాస్తవాలను చెప్పటానికి ఇష్టపడటం లేదట. అంటే వాస్తవాలను చెప్పటం లేదు, అలాగని చంద్రబాబు చెప్పినదాన్ని అంగీకరించటం లేదు. డిస్కషన్ ఎందుకులే అని మాట్లాడటం లేదంతే.
టిడిపి నేతల ప్రకారమే రాయలసీమలో చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలను వైసిపి దాదాపు స్వీప్ చేస్తుందంటున్నారు. ఇక ప్రకాశం, నెల్లూరులో స్వీప్ తప్పదంటున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో మెజారిటీ సీట్లు వైసిపివేనట. ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లు వైసిపి ఖాతాలో పడతాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా మంచి ఫలితాలనే వైసిపి సాధిస్తుందని టిడిపి నేతలే చెబుతున్నారు. కాబట్టి రేపటి ఫలితం ఎలాగుంటుందో తెలీదు కానీ ఇప్పటికైతే టిడిపి నేతలంతా ఒకవైపు చంద్రబాబు ఒక్కరు ఒకవైపు అని అర్ధమైపోతోంది.