చదువుకుని ఉద్యోగం చేసే మహిళా ఇప్పుడు చట్టసభల్లో సీటు కోసం పోటీ పడుతోంది. సవాళ్లు, అవమానాలు, సంఘర్షణలు అన్నింటిని వజ్రసంకల్పంతో ధీటుగా ఎదుర్కొంటోంది. ఈ ఎన్నికల్లో మాత్ర విమెన్ పవర్ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈసారి ఎన్నికలు నరేంద్ర మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ మధ్య పోరాటంలా కనిపిస్తున్నా.. రోజూ వార్తలలో కనిపిస్తున్నది మాత్రం మహిళా నేతలు. పార్టీ ఏదైనా సరే.. జయప్రద నుంచి ఊర్మిళ వరకు మాయావతి నుంచి మమత బెనర్జీ వరకు మహిళలు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
మరికొద్ది రోజుల్లో కాలవ్యవధి ముగుస్తున్న 16వ లోక్సభలో 543 ఎంపీల్లో 66 మంది మాత్రమే మహిళా ఎంపీలు ఉన్నారు. అంటే 11 శాతం అన్నమాట. అయితే 21 శాతం ఎంపీలున్న బంగ్లాదేశ్ కన్నా.. 20 శాతం ఎంపీలున్న పాక్ నేషనల్ అసెంబ్లీకన్నా మన పార్లమెంట్లో మహిళా ఎంపీల సంఖ్య తక్కువ. కానీ ఈ సారి మాత్రం ఎన్నికల బరిలో నిలిచిన మహిళా అభ్యర్థుల సంఖ్య ఎక్కువగానే ఉంది. మహిళల సాధికారత అవకాశాలు అనే పెద్దమాటలు చెప్పే పెద్ద పార్టీలు మాత్రం మహిళలకు ప్రాతినిధ్యం మాత్రం పెద్దగా ఇవ్వడం లేదు.
మహిళలకు అగ్రతాంబూలం ఇస్తున్న పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది తృణమూల్ కాంగ్రెస్. బెంగాల్ దీదీ మమతా బెనర్జీ ఈసారి లోక్సభ టెకెట్లలో 40.5 శాతాన్ని మహిళలకు ఇచ్చారు. అంటూ తృణమూల్ 42 ఎంపీ సీట్లలో 17 చోటల్ల మహిళలకు టికెట్ ఇచ్చారు. నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ 19 సీట్లలో ఏడింటివి అంటే 36.8 శాతం టికెట్లకు నారీలోకానికి ఇచ్చింది.
లాలూ పార్టీ ఆర్జేడీ 17 సీట్లలో మూడు చోట్ల మహిళలకు అవకాశం ఇచ్చి 17.6 శాతానికి మహిళలకు ఇచ్చినట్లు చాటుకుంది. 29 సీట్లలో పోటీ చేస్తున్న సమాజ్వాది.. ఐదు చోట్ల అంటే 17.2 శాతం మహిళలకు టికెట్లు ఇచ్చింది. కానీ జాతీయ పార్టీలు మాత్రం ఇంతకన్నా తక్కువ మొత్తంలోనే మహిళలకు టికెట్లు ఇచ్చాయి. కాంగ్రెస్ 47 మంది మహిళలకు, బీజేపీ 45 మంది మహిళలకు టికెట్లు ఇచ్చి సరిపెట్టుకున్నాయి.