పశ్చిమ గోదావరి జిల్లా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సంచలనం నమోదు చేసింది. జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు ఎంపీ స్థానాలు క్వీన్స్వీప్ చేసేసింది. చివరకు జగన్ సొంత జిల్లా కడప, చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ ఆధిపత్యం చూపించిన జగన్కు ఈ జిల్లాలో మాత్రం ఒక్క సీటు కూడా దక్కలేదు. తనను అధికార పీఠానికి దూరం చేసిన ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్ ఈ ఐదేళ్లలో పెద్ద కసరత్తే చేశారు. తన బాబాయ్ వైవి.సుబ్బారెడ్డిని ఈ జిల్లాకు ఇన్చార్జ్గా నియమించారు.
సుబ్బారెడ్డి గత యేడాదిన్నర కాలంగా పశ్చిమగోగదావరిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. సుబ్బారెడ్డి అభ్యర్థుల ఎంపిక నుంచి, ప్రచార సరళి వరకు ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడ పాదయాత్రకు అద్భుతమైన స్పందన లభించింది. ఇక యువభేరి, బీసీ సదస్సు లాంటివి ఈ జిల్లాలోనే నిర్వహించారు. జిల్లాలో ఎన్నో సమస్యలపై వైసీపీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది. మరో వైపు జిల్లాలో స్థానిక సంస్థల నుంచి, ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు అందరూ టీడీపీ వాళ్లే ఉండడంతో వాళ్ల నియంతృత్వ పాలన, జన్మభూమి కమిటీలతో ప్రజల్లోనూ చాలా వరకు విసుగు వచ్చేసింది. దీంతో ఈ ఎన్నికల్లో ఓటర్ల మార్పు పోలింగ్లోనే స్పష్టంగా కనపడింది.
జిల్లాలో పోలింగ్ ముగిశాక వైసీపీ తాము మెజార్టీ సీట్లు సాధిస్తామన్న ధీమాతో ఉంది. టీడీపీ వాళ్లు సైతం ఈ సారి జిల్లాలో తమకు భారీ ఎత్తున సీట్లు లాస్ అవుతున్నాయని ఒప్పుకుంటున్నారు. రెండు ఎంపీ సీటగ్లలో ఓ ఎంపీ సీటు ఖచ్చితంగా గెలుచుకుంటామని... మరో సీటులో పోటీ ఉందని వైసీపీ చెపుతోంది. పోలింగ్ సరళి కూడా అదే చెపుతోంది. ఇక రెండు జిల్లాల పరిధిలో ఉన్న ఓ ఎంపీ సీటు అభ్యర్థి విషయంలో వైసీపీ వేసిన ప్రయోగాత్మక ఎత్తుగడ కూడా సక్సెస్ అయ్యిందని వైసీపీ వాళ్లు చెపుతున్నారు. ఇక జిల్లాలో మొత్తం 15 సీట్లు ఉంటే ఈ సారి వైసీపీ 8 సీట్లలో ఖచ్చితంగా గెలుస్తామంటూ లెక్కలు వేసుకుంటోంది. ఇక టీడీపీ 4-5 సీట్లకే మాత్రమే పరిమితమవుతుందని.. మరో రెండు, మూడు సీట్లలో గట్టి పోటీ నెలకొందంటున్నారు.
వైసీపీ ఏలూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలో జిల్లాలో ఉన్న సెగ్మెంట్లలో బాగా సత్తాచాటింది. ఇక టీడీపీకి ఆరు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉండడంతో అక్కడ మాత్రమే గట్టి పోటీ ఇచ్చింది. ఆ నియోజకవర్గాల్లోనే టీడీపీ అభ్యర్థుల గెలుపుపై ఆశలు ఉన్నాయి. ఇక మరో రెండు చోట్ల ఇద్దరికి 50-50 ఛాన్సులు ఉన్నాయి. ఇక జనసేన అధినేత పవన్కళ్యాణ్ పోటీ చేసిన భీమవరంతో పాటు తాడేపల్లిగూడెంలో రెండు పార్టీల మధ్య ముక్కోణపు పోటీ అనుకున్నా ఈ రెండు చోట్ల టీడీపీకి ఆశల్లేవ్. ఇక్కడ వైసీపీ వర్సెస్ జనసేన మధ్యే టఫ్ ఫైట్ నడిచింది. ఏదేమైనా జీరో నుంచి వైసీపీ 8 సీట్లకు ఎదగడం.... మిగిలిన సీట్లలోనూ ఒకటో రెండో అదనంగా కలిసొచ్చే ఛాన్సులు ఉండడంతో ఈ సారి పశ్చిమవైసీపీ నేతలకు, అటు వైసీపీ నాయకత్వం ఆనందానికి అవధులు లేవు.