ఇంటర్ ఫలితాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల ఉదంతం తెలంగాణలో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే విద్యార్ధి సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ఆందోళన చేపట్టాయి. తాజాగా విద్యార్థుల ఆత్మహత్యలు...ప్రభుత్వ హత్యలు, అస్తవ్యస్తం అవుతున్నవ్యవస్థలు అనే అంశంపై నగరంలోని సోమాజిగూడ ప్రెస్క్లబ్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, టీజెఎస్ అధ్యక్షులు కోదండరాం, బీసీ నేత ఆర్.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్ల ఆధారంగా కేసీఆర్ను పలువురు టార్గెట్ చేశారు.
రాష్ట్రంలో 19రోజుల నుంచి మారణకాండ జరుగుతుందని, ఇప్పటి వరకు 26మంది విద్యార్థులు చనిపోయారని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ అవకతవకలపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తన తండ్రి, సీఎం కేసీఆర్ ను చౌకిదార్ కాదు జిమ్మేదర్ అన్నారని, మరి ఇంటర్మీడియట్ బోర్డులో జరిగిన అవకతవకలకు ఎవరు జిమ్మేదారు చెప్పాలని దత్తాత్రేయ అన్నారు. గ్లోబరిన సంస్థ విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేసిందని, ఈ విషయంపై రాష్ట్రపతి ని కలుస్తామని అన్నారు.
చనిపోయిన వారంతా టెన్త్ లో బాగా చదివారని, మంచి మార్కులు తెచ్చుకున్నారని అలాంటి విద్యార్ధులు ఫెయిలవ్వడంలో తప్పెవరిదని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఇంత జరిగినా ప్రభుత్వం తమ ఒప్పంద సంస్థ గ్లోబరిన ను ఎందుకు తప్పించడం లేదన్నారు. సర్కార్ నుంచి, ఇంటర్ బోర్డు నుంచి ఈ విషయంపై ఎలాంటి సమాధానం రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. చనిపోయిన వారంతా ఫెయిల్ అవుతారా అని అన్నారు. చనిపోయిన విద్యార్ధులను కించ పరిచిన అధికారులు…వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఫెయిలైన కారణంగా మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధులను సరదాగ చనిపోయారని అనడం సరికాదని అధికారులను ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. మరణాలపై సిట్టింగ్ జడ్జి చే విచారణ జరిపిస్తే క్లారిటీ వచ్చేదని, ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. ఖాళీ పోస్టులును బర్తరఫ్ చేసుంటే ఈ మరణాల ఉండేవి కావన్నారు. ఆత్మహత్యలపై ఈనెల 27 న ధర్నా చౌక్ వద్ద నిరసన తెలుపుతామని కృష్ణయ్య అన్నారు.