సుప్రీంలో విచారణకు చంద్రబాబు..అందుకేనా!
ఈ అంశంపై 22 పార్టీలు వేసిన రివ్యూ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం బిజీబిజీగా ఉన్నారు. ఏపీ భవన్లో చంద్రబాబుతో ఫరూక్ అబ్దుల్లా భేటీ అయ్యారు. వీవీప్యాట్ల అంశంపై చంద్రబాబు, ఫరూక్ అబ్దుల్లా మధ్య చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికలకు 75 రోజులు సమయం తీసుకోగా లేనిది.. స్లిప్పుల లెక్కింపునకు 6 రోజుల కేటాయిస్తే ఇబ్బంది ఏమిటి అని చంద్రబాబు ఈసీని ప్రశ్నించారు.
వీవీ ప్యాట్ స్లిప్పుల్లో తేడాలు వస్తే 100శాతం లెక్కించిన తర్వాతే ఫలితాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ చెప్పుచేతుల్లో కాకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని చంద్రబాబు కోరారు.సుప్రీంకోర్టులో వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు రివ్యూ పిటిషన్ విచారణకు చంద్రబాబు, ఫరూక్ అబ్దుల్లా, ఇతర పార్టీ నేతలు హాజరుకానున్నారు.
కాగా.. 50 శాతం వీవీప్యాట్ల లెక్కింపునకు ఆరు రోజులు పడుతుందని, భారీగా అదనపు సిబ్బంది అవసరమని సుప్రీంకోర్టుకు ఈసీ వినిపించిన వాదనను చంద్రబాబు తప్పుపట్టారు. 5 పోలింగ్ బూత్ లలో మాత్రమే స్లిప్పులను లెక్కించడం అంటే 2శాతం మాత్రమే అని.. ఈసీ ఈ నిర్ణయంతో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని అంగీకరించిందన్నారు. 2శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను మాత్రమే లెక్కించడం ద్వారా మిగిలిన 98శాతంతో జరిగే ట్యాంపరింగ్ ను ఎలా నిరోధిస్తారు అని చంద్రబాబు ప్రశ్నించారు.