ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన నాటి నుంచి ఆయన మాటల్లో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. తాజాగా, ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేక గాలి వీస్తోందని.. ఓటమి నైరాశ్యంతోనే నరేంద్రమోడీ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో తానేం చేశాడో నరేంద్ర మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. చేసింది, చెప్పేందుకేమీ లేదు కాబట్టే మోడీ చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 26 ఏళ్ల క్రితం చనిపోయిన రాజీవ్ గాంధీ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు..? అని ప్రశ్నించారు. ఫ్రస్టేషన్తోనే మోడీ దిగజారి మాట్లాడుతున్నారు.
దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయగలిగామని ప్రకటించారు. టీడీపీతో పెట్టుకున్నప్పుడే నరేంద్ర మోడీ పతనం ప్రారంభమైందని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి రాబోయేది కొత్త ప్రధానే.. నరేంద్ర మోడీ ఇకపై ప్రధానిగా ఉండబోరని చంద్రబాబు జోస్యం చెప్పారు. రాష్ట్రం కోసమే బీజేపీపై తిరగబడ్డామని, తన సొంతం కోసం కాదని తెలిపారు. ప్రత్యర్ధులపై ఈడీ, ఐటీ ద్వారా కక్షసాధింపు గతంలో లేదన్న ఏపీ సీఎం.. 5 కోట్ల ప్రజల ప్రయోజనాల కోసమే మోడీపై తిరగబడ్డామన్నారు.
ఈ సందర్భంగా తమ పోరాటం గురించి చంద్రబాబు వివరించారు. ప్రజాస్వామ్యం కోసమే తొలిసారి సుప్రీంకోర్టుకు వెళ్లి వీవీ ప్యాట్ రశీదుల కౌంటింగ్ 50 శాతం లెక్కించాలని అడిగామని అన్నారు. టీడీపీ పోరాటం వల్లే ఒక బూత్ కౌంటింగ్ను 5 బూత్లకు పెంచగలిగామని తెలిపారు. కౌంటింగ్ లో తేడాలు వచ్చినప్పుడు అసెంబ్లీలో అన్ని బూత్ లు కౌంటింగ్ చేయాలనేదే మన డిమాండ్ అని చంద్రబాబు వెల్లడించారు. కాగా, మోడీ బ్యాడ్ టైం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.