ఏపీలో అధికార టీడీపీ గెలుపుపై ఒక్కొక్కరికి ఉన్న భ్రమలు క్రమక్రమంగా తొలగిపోతున్నట్లున్నాయ్. పోలింగ్ ముగిశాక సరళి పరిశీలించుకున్నాక చంద్రబాబుకే నమ్మకాలు పోయాయ్. అందుకే చంద్రబాబు ఒక్కో రోజు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. ముందుగా ఈవీఎంలపై విరుచుకుపడ్డ చంద్రబాబు.... ఆ తర్వాత మోడీ... ఆ తర్వాత ఎన్నికల కమిషన్... ఇక సీఎస్ ఇలా ఎవరు కనపడితే వాళ్లను టార్గెట్గా చేసుకుంటూ పోతున్నారు. చంద్రబాబు తన ఓటమిని ఎవరిమీద రుద్దాలా ? అని ఆలోచిస్తూ చివరకు ఎవరు కనపడితే వాళ్ల మీద తన అక్రోషాన్ని చూపించేస్తున్నారు.
ఇక ఇప్పటి వరకు టీడీపీకి వన్సైడ్గా సపోర్ట్ చేస్తూ వచ్చిన పచ్చ మీడియాకు ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం కలుగుతున్నట్టు కనపడుతోంది. ఇక టీడీపీకి వన్సైడ్గా వంతపాడే ఈనాడు కూడా టీడీపీ ఓటమిని పరోక్షంగా ఒప్పుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా ఈనాడులో వచ్చిన ఆర్టికల్లో కేంద్రంలో ఈ సారి ఎవరు అధికారంలోకి వచ్చినా మిత్రపక్షాలతోనే అంటూ ఓ బ్యానర్ రాసుకొచ్చింది. ఈ కథనంలో ఎక్కడా టీడీపీ ప్రస్తావన లేదు.
ఇక సొంతంగా ఈ సారి బీజేపీ అధికారంలోకి రాలేదని తేల్చేసిన ఈనాడు ఖచ్చితంగా మిత్రపక్షాల మద్దతు తీసుకుని అయినా మళ్లీ మోడీయే ప్రధానమంత్రి అవుతాడని చెప్పింది. అలా కూడా కుదరని పక్షంలో కాంగ్రెస్ కూటమిలో ఉన్న పార్టీలను కూడా బలవంతంగా లేదా... అవకాశాలంటూ వలవేసి తన వైపునకు తిప్పుకుని అయినా మళ్లీ మోడీయే ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉందన్నది ఆ కథనం సారాంసం.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ మద్దతు కూడా బీజేపీకే ఉంటుందని కూడా చెప్పింది. మరి ఈ నాడు ఈక్వేషన్లు, కాలిక్యులేషన్ల ప్రకారం ఏపీలో టీడీపీ హవా ఉంటే బీజేపీ వైసీపీ మద్దతు ఎందుకు తీసుకుంటుందన్నది వాళ్లకే తెలియాలి. అంటే ఇక్కడ వైసీపీ హవా ఉందని పరోక్షంగా ఒప్పుకున్నట్టే. ఇక కాంగ్రెస్ కూటమి గురించి లెక్కలు తీసేటప్పుడు కూడా ఎక్కడా టీడీపీ సీట్ల లెక్క తీసుకురాలేదు. అయితే ఈనాడు ఇక్కడే చంద్రబాబు ఘనత మరోసారి అలవాటుగా వల్లెవేసింది. దేశంలో బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే గొప్ప వ్యూహకర్తగా ఇప్పటికే వ్యూహాలు పన్నుతున్నట్టు చెప్పింది. ఏదేమైనా ఏపీలో కౌంటింగ్కు రోజులు దగ్గర పడుతోన్న కొద్ది టీడీపీ గెలుపుపై ఆ పార్టీ వీరాభిమానులకే మబ్బులు వీడుతున్నాయ్.