ఇప్పటికే టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టిందా! చట్టుబండలైన ఫిరాయింపుల చట్టం!

పార్టీ ఫిరాయింపు అంటే దాంపత్య భాగస్వామి ఉండగా వారికి విడాకులు ఇవ్వకుండా దొడ్దిదారిన ప్రలోభాలకు లొంగి వదిలేసి వేరేవాళ్ళతో అక్రమంగా రాజకీయ దాంపత్యం నెరపటం. ఇదెంత దుర్మార్గమో వేరే చెప్పనవసరం లేదు. అంటే రాజకీయ వ్యభిచారం చెయ్యటమే.  ఈ ఫిరాయింపుదారుల మూల పురుషుడు గయాలాల్. హర్యానా లోని హూస్నాపూర్‌ శాసనసభ నియోజకవర్గం అనాటికి అధికారంలో ఉన్న శాసనసభ్యుడు.

1967 వ సంవత్సరం, కేంద్ర పార్లమెంటు, రాష్ట్రాల విధాన సభల ఎన్నికలకు నగరా మోగింది. నాడు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ లో సీటు లభిస్తుందన్న నమ్మకం లేక ఒక రోజు వ్యవధిలో మూడు పార్టీలు మారాడు. గయా లాల్‌ ఫలానా పార్టీలో చేరాడు అని వార్తలు చదువుతుండగానే కాదు కాదు మరోపార్టీలోకి మారినట్టు వార్తలు రావడంతో  ఆయా రామ్‌, గయా రామ్‌ అంటూ సామెత ఆయన పేరుతోనే వాడుకలోకి వచ్చింది.  నాయకులు పార్టీలు మారడం ఆనాటికి కొత్తేమీ కాకపోయినా 1970 తర్వాత నేతల బేరసారాలు తీవ్రస్థాయికి చేరుకొన్నాయి. కాంగ్రెస్ పాలన లో పుట్టుకొచ్చిన ఈ అనర్ధం జనతా పార్టీ ఆవిష్కరణతో నింగినంటింది. 

ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి అంటే ఎమర్జెన్సీ (197577) తరవాత జనతా పార్టీ పతనం సందర్భంగా కేంద్రంలో ఏర్పడిన వివిధ పార్టీల ప్రభుత్వాల కాలంలో ను,  మరల ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత,  ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పడం కష్టంగా ఉండేది. ఆనాడు నేతల పార్టీ మార్పిడి విధానంపై పెద్దఎత్తున విమర్శలు తలెత్తాయి. ఇందిరాగాంధీ హత్య అనంతరం (30.10.1984) జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి రికార్డు స్థాయిలో మెజారిటీ లభించడమే కాకుండా రాజీవ్‌ గాంధీ ప్రధాన మంత్రి అయ్యారు. 

తల్లి మరణాంతరం రాజకీయాలలోకి  కొత్తగా ప్రవేశించిన రాజీవ్‌ గాంధీ తనకు లభించిన అసాధారణ మెజారిటీని ఆసరా చేసుకొని 52వ రాజ్యాంగ సవరణద్వారా రాజ్యాంగంలో కొత్తగా 10 షెడ్యూల్‌ చేర్చి యాంటి డిఫెక్షన్‌ లా (పార్టీ మార్పిడి నిరోధక చట్టాన్ని) అమల్లోకి తీసుకువచ్చారు. 

ఈ చట్టం ప్రకారం ఈ క్రింది సందర్భాల్లో  తమ సభ్యత్వాన్ని కోల్పోతారు:

*చట్టసభలకు అంటే కేంద్రం లో పార్లమెంటు, రాష్ట్రాలలో విధానసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు తాము ఏ పార్టీ నుంచి ఎన్నికయ్యారో ఆ పార్టీకి కట్టుబడి ఉండాలి. 

*ప్రజాప్రతినిధులు తాము ఎన్నికైన పార్టీని వదిలి, వేరే పార్టీలోకి మారినా, చట్టసభలలో పార్టీ విప్‌ల ఉత్తర్వులను పాటించకపోయినా, 

*ప్రజాప్రతినిధులు పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా సభలో ఓటు వేసినా  


భారతదేశంలో ఎంత గొప్ప చట్టం చేసినా ఎక్కడో ఒక చోట చట్టానికి రంధ్రం ఉంటుందనే నానుడి ప్రకారం ఈ చట్టానికి కూడా కొన్ని మినహాయింపు ఇచ్చారు. ఎన్నికైన ప్రజాప్రతినిధి వ్యక్తిగతంగా కాకుండా కొంత మంది కలిసి సమూహం తో అంటే మొత్తం సభ్యులలో మూడింట ఒక వంతు మంది గుంపుగా పార్టీ మారిన పక్షంలో ఈ చట్టం వర్తించదు. 


ఈ మినహాయింపు చివరకు ఎంతో ఉన్నత ఆశయం ఏర్పాటు చేసిన పార్టీ మార్పిడి నిరోధక చట్టాన్ని నిరర్థకంగా మార్చుతోంది. మూడింట ఒకవంతు 1/3 అంటే ఎవరికి వారే సులభంగా పార్టీ మారుతున్నారనే ఉద్దేశ్యంతో 2003వ సంవత్సరంలో చట్టాన్ని 1/3 బదులుగా మూడింట రెండువంతుల 2/3 మందిగా సవరణ చేశారు. అయినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. 



చట్టానికి రంద్రము ఉండకూడదు ఉంటే రంధ్రాన్వేషణ చేసి అందులోంచి దూరిపోయే వాళ్ళకు భారత్లో కొదవ లేదు.  


అంతేకాకుండా ఈ చట్టం మొత్తం “లోక్‌సభ, విధానసభల సభాధిపతుల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. సభలోని సభ్యుడు తాను ఎన్నికైన పార్టీని వదిలి వేరే పార్టీలోకి మారినా, చట్టసభలలో పార్టీ విప్‌ల ఉత్తర్వులను పాటించక పోయినా, పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా సభలో ఓటు చేసినా ఆ విషయాన్ని ఆయా పార్టీ అధ్యక్షులు లేదా చీఫ్‌-విప్‌ స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలి.  ఆ ఫిర్యాదుపై స్పీకర్‌ విచారణ చేసి పార్టీ మారిన సభ్యుడిని కొనసాగించాలా? లేదా? అనర్హుడిగా ప్రకటిస్తారు. స్పీకర్‌పై ఒత్తిడి చేసే అధికారం కోర్టులకు కూడా లేదు. 

చట్టసభలలో స్పీకర్‌ పార్టీరహితంగా వ్యవహరించాలన్న నిబంధన ఉంది. కాని స్పీకర్‌గా పోటీ చేసే వ్యక్తి కూడా ఒక పార్టీ నుంచి ఎన్నిక కావడం, ఆ పార్టీ సహాయంతోనే స్పీకర్‌గా ఎన్నికైన నాయకుడు పార్టీ రహితంగా వ్యవహరిస్తారనుకోవడం అత్యాశే అవ్ఞతుంది. ఈ కారణంగానే కేంద్రంలో, రాష్ట్ర విధానసభలలో నేతల బేరసారాలు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. 


రాజీవ్‌ గాంధీ మరణాంతరం కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రధాన మంత్రి బాధ్యతలు స్వీకరించిన పి.వి. నరసింహారావు (జూన్ 1991 తొ మే 1996) హయాంలో “పార్టీ మార్పిడి నిరోధక చట్టం” మరింత దిగజారిందని చెప్ప వచ్చు. ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల సంఖ్య 232 మంది మాత్రమే. అధికారం చేపట్టాలంటే కనీసం 273 స్థానాలు కావాలి. ఆనాడు పి.వి. నరసింహా రావు ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి మెజారిటీ లేదు. 


1993 లో పి.వి నరసింహారావుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు వందల కోట్ల రూపాయలు చేతులు మారడం, జార్ఖండ్‌ ముక్తి మోర్చ (జెఎంఎం) ముడుపులు కేసు విషయం గుర్తుండే ఉంటుంది. అంతేకాకుండా పి.వి నరసింహారావు మెజారిటీ సంపాదించడంలో భాగంగానే ఆనాడు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంపార్టీ నుంచి ఎన్నికైన తొమ్మిది మంది సభ్యులలో అయిదుగురు సభ్యులు పార్టీ నుంచి గ్రూపుగా చీలిపోయి కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు.   

ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేసే విధంగా ఇటీవల కాలంలో అధికారంలోకి వచ్చిన ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు పార్టీ మార్పిడి చట్టంలో సభాపతికి ఉన్న అధికారాన్ని ఆసరా చేసుకొని ప్రతిపక్ష సభ్యులను నయానా భయానా ఒప్పించి తమవైపు తిప్పుకొంటున్నారు. ఆ విధంగా సభ్యులను తమవైపు తిప్పుకోవడాన్ని ముద్దుగా “ఆకర్ష” అని పేరు పెట్టారు.  

తాను ఏం చేసినా ప్రశ్నించే వారు ఉండకూడదనే రీతిలో అసలు ప్రతిపక్షమే ఉండకూడదనే ఆలోచనలు చేస్తున్నారు వివిధ అధికార పార్టీల అధినేతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోనే కాకుండా రాష్ట్ర విభజన అనంతరం కూడా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఇదే తరహా ఆలోచనలు చేశారనడంలో అతిశయోక్తి లేదు. ఇద్దరు చంద్రుల తీరంతా ఈ మచ్చలే.

తాజాగా తెలంగాణాలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శాసనసభ్యులు పెద్దఎత్తున తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్‌ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా నిలుపు కోవడం కూడా కష్టమని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు పూర్తయి మే 23వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. 
ఫలితాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రాజకీయ పార్టీనేతలు మాత్రం తమకు మెజారిటీ సంపాదించడం కోసం ఎవరిని ఏవిధంగా ఆకర్షించాలనే ఆలోచనలలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఎంత ముఖ్యమో ప్రతిపక్ష పార్టీ కూడా అంతే ముఖ్యం అన్నది మరవకూడదు. లేకపోతే అధికార పార్టీ ఆగడాలకు హద్దుండదని మన ఇద్దరు చంద్రులు నిరూపించారు. 

చట్టాలు చేసే సమయంలో ప్రజాభిప్రాయం ప్రతిస్పందించాలంటే అర్థవంత మైన చర్చలు జరగాలి. పార్లమెంట్‌ లో హిరేన్‌ ముఖర్జీ, పుచ్చలపల్లి సుందరయ్య, ఎ.కె. గోపాలన్‌, ఎస్‌.ఎ.డాంగే వంటి ప్రతిపక్ష నేతలు ప్రతిపక్ష నాయకులు చేసిన ప్రసంగాలతో సమర్థవంతమైన చట్టాలు రూపొందాయి. చట్టసభలలో అర్థవంతమైన చర్చలు జరగాలంటే బలమైన, బాధ్యత కలిగిన ప్రతిపక్షం ఉండాలి. చట్టసభలు నీతి నియమాలకు, ప్రజాభిప్రాయానికి అద్దంపట్టేలా ఉండాలంటే “పార్టీ మార్పిడి నిరోధ చట్టం” లోసుగులు లేకుండా పటిష్టం చేయడం ఒక్కటే మార్గం. చట్టం ఏనాటికి చట్టుబండలు కాకుండా చూడాలి. 

కాని ప్రజలకు ఉపయోగమైన చట్టాలను రూపొందించాల్సిన చట్టసభలలోని నాయకులే ఆపరేషన్ ఆకర్ష పథకాలు రచిస్తున్నప్పుడు పటిష్టమైన చట్టం వస్తుందను కోవడం భ్రమే కాదు అత్యాశ కూడా అవుతుంది. తమ పాలన కాలంలో ప్రతిపక్షాలను నిర్మూలించిన శాసనసభాపతిని ఎన్నికల్లో ఓడించటం ప్రజలు తమ తక్షణ కర్తవ్యం గా భావించాలి దాని తోడు ఆ అధికారపక్ష పార్టీని దాని జీవితకాలంలో ఎన్ని ప్రలోభాలు ఎరవేసినా అధికారానికి ఆమడ దూరంలో ఉంచటం ప్రజలు ప్రాణంకన్నా మిన్న గా భావించాలి. 

మే 23 న ఫలితాలు రావలసి ఉండగా, అప్పుడే దానికి ముందుగా ప్రస్తుతం అధికారంలో ఉన్న టిడిపి “ఆపరేషన్ ఆకర్ష" ప్రయత్నాలు తీవ్రంగా మొదలెట్టిన దాఖలాలు కనిపిస్తుండగా, ప్రతిపక్షం తన ఎమెల్యేలను కాపాడుకుంటూ ఏం చేయాలా? అని ఆలోచిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: