షాకింగ్ : మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీజేవైఎం కార్యకర్త ప్రియాంక శర్మను తక్షణమే విడుదల చేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని మమతా సర్కార్‌ను సుప్రీంకోర్టు హెచ్చరించింది. కాగా మమతా బెనర్జీపై వివాదాస్పద ఫోటోను ఫార్వర్డ్‌ చేసిన ప్రియాంక శర్మ అరెస్ట్‌ ఏకపక్షమని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆమెను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని, లేకుంటే తదుపరి పర్యవసానాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరికలు చేసింది. 


ప్రియాంక శర్మను విడుదల చేయాలని నిన్న (మంగళవారం) సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మమతా సర్కార్‌ బేఖాతరు చేసింది. దీంతో ప్రియాంక బంధువులు మమతా బెనర్జీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా మమతపై అ‍భ్యంతరకర పోస్ట్‌ను ఫార్వర్డ్‌ చేసినందుకు ప్రియాంశ శర్మ బేషరతుగా క్షమాపణలు చెప్పిన తర్వాతనే ఆమెను విడుదల చేస్తామని పశ్చిమ బెంగాల్‌ అధికారులు ప్రకటించిన విషయం విదితమే.


అయితే ఆమెను ఇవాళ ఉదయం 9.40 కి విడుదల చేసినట్లు ప్రభుత్వతరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ప్రియాంకా శర్మను తక్షణమే ఎందుకు విడుదల చేయలేదని న్యాయస్థానం ప్రశ్నించింది.


ఎట్టకేలకు సుప్రీంకోర్టు జోక్యంతో జైలు నుంచి విడుదలైన బీజేవైఎం కార్యకర్త ప్రియాంక శర‍్మ తనపట్ల అధికారులు అనుచితం గా ప్రవర్తించారని ఆరోపించారు. ఆమె బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ,తాను బీజేపీ కార్యకర్తను కాబట్టే టార్గెట్‌ చేశారని వ్యాఖ్యానించారు. ఫోటో మార్ఫింగ్‌ పై తాను క్షమాపణ చెప్పేది లేదని ప్రియాంక శర్మ మరోసారి స్పష్టం చేశారు. 


తనతో అధికారులు బలవంతంగా క్షమాపణ చెప్పించేందుకు యత్నించారని ఆమె ఆరోపించారు. సుప్రీంకోర్టు నిన్న బెయిల్‌ మంజూరుచేసినా, అధికారులు మాత్రం తనను ఇవాళ విడుదల చేశారని ఆమె అన్నారు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులతో పాటు న్యాయవాదిని కూడా కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని ప్రియాంక శర్మ ఆరోపించారు. ప్రధాని మోదీని ట్రోల్‌ చేసినందుకు మమతా బెనర్జీ నే అరెస్ట్‌ చేయాలని ప్రియాంక శర్మ డిమాండ్‌ చేశారు. తనపై పెట్టిన కేసుపై పోరాటం చేస్తానని ఆమె తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: