ఏపీలో జనసేన పార్టీకి ఎన్ని అసెంబ్లీ సీట్లు వస్తాయా ? అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. గత ఎన్నికలకు ముందే పార్టీ పెట్టి ఆ ఎన్నికల్లో బీజేపీ, జనసేనకు సపోర్ట్ చేసిన పవన్కళ్యాణ్ ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి ఒంటరి పోరుకు దిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన పోలింగ్ ముగియడంతో వెలువడుతోన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు జనసేన ప్రభావం ఏపీలో శూన్యమని తేల్చేశాయి.
ముందుగా ఆంధ్ర ఆక్టోపస్, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఫలితాల్లో పవన్ పవర్ రెండు, మూడు స్థానాల్లో మాత్రమే పని చేసిందని చెప్పారు. జనసేన 1 నుంచి 3 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపారు. మరో రెండు స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చినట్లు తెలిపారు. సీపీఎస్ సర్వే ప్రకారం జనసేనకు 7.3% శాతం ఓట్లుతో పాటు 0-2 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పింది.
న్యూస్-18 చానెల్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో వైసీపీకి 13 - 14 సీట్లు రాగా, టీడీపీకి 10 - 12 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులు సున్నా నుంచి ఒక సీటు గెలుస్తారని పేర్కొంది. ఏదేమైనా జనసేన గెలిచే అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో భీమవరంలో పవన్ ఓటమి ఖాయమంటున్నారు. ఇక గాజువాకలో మాత్రమే ఆయన గెలుస్తాడని... మిగిలిన నియోజకవర్గాల్లో జనసేన ఎక్కడైనా మరో చోట గెలిచినా గొప్పే అన్నట్టుగా ఉంది.
ఒక్క పీపుల్ ఫల్స్ సర్వే మాత్రమే జనసేనకు 4-6 సీట్ల వరకు వస్తాయని చెప్పింది. ఇప్పటి వరకు వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఈ ఒక్క సర్వే మాత్రమే జనసేనపై కాస్త ప్రేమ చూపినట్టు కనిపించింది. జనసేనకు పశ్చిమ గోదావరిలో రెండు, తూర్పుగోదావరి, విశాఖపట్నంలో ఒక్కో సీటు గెలిచే అవకాశముందన్నారు. చాలా సర్వేలు జనసేనకు 0-1 సీటు మాత్రమే వస్తుందంటే..ఈ ఒక్క సర్వే 4-6 సీట్లు చెప్పింది. ఏదేమైనా ఏపీలో ఎన్నో అంచనాలతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ పవర్ సున్నాయే అని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. మరి ఫలితాలు ఎలా ? ఉంటాయో ?