జైట్లీ Vs నిర్మల-సుష్మ Vs జైశంకర్-సమఉజ్జీలు కావచ్చేమో! కాని వారి ప్రజాభిమానానికి వీరు ధీటురాగలరా!

సుమారు ఒక దశాబ్ధం తర్వాత కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన  భారతీయ జనతా పార్టీలో నిపుణులు,  అనుభవఙ్జుల కు కొరత ఇసుమంతైనా లేదు. బీజేపి నాయకుల్లో దాదాపు అందరూ రాజకీయాల్లో తలపండినవాళ్లే. ప్రజలవిశ్వాసాన్ని నిలుపు కోవాలన్నా, మరోసారి అధికారాన్ని చేజిక్కించు కోవాలన్నా తొలి ఐదేళ్లు ఆ పార్టీకి ఎంతో అవసరం కాబట్టి మంత్రుల ఎంపికలో ప్రధాని ఆచితూచి అడుగువేశారనే చెప్పాలి. కీలక హోం, ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖలను సమర్థులకే అప్పగించారు. 

ఆర్థిక మంత్రిగా ఎవర్ని తీసుకోవాలని నరేంద్ర మోదీ పడిన సంఘర్షణకు అరుణ్‌ జైట్లీ ఒక సమాధానం.

ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యత విషయంలో సమర్ధులైన వారికే విదేశీ వ్యవహారాల బాధ్యతలు అప్పగించాలి. ఆ సమయంలో భాజపాకు సుష్మాస్వరాజ్‌ ఒక ఆశాకిరణం. మరో యోచన లేకుండా ఇతర ఉద్ధండులైన నేతలతో చర్చించి వీరిద్దరికీ ఈ రెండు కీలక శాఖలు కట్ట బెట్టారు. విదేశాంగ శాఖకు సుష్మ స్వరాజ్ ను ఎంపిక చేసిన నరేంద్ర మోడీ అభినందనీయుడు.

నిజానికి విదేశీ వ్యవహారాలు చూసుకోవాల్సిన వారికి ఉండవలసిన లక్షణాలన్నీ సుష్మ లో కొట్టొచ్చి నట్లు కనిపిస్తాయి. విదేశీ వ్యవహారాల్లోకి ఆమె వచ్చాక ఆ శాఖకు బాధ్యతలు తెలిసొచ్చాయా? లేక ఆ శాఖకు ఉండాల్సిన బాధ్యతల్లో ఆమె అలా ఇమిడిపోయారా ? అన్నది వివరించటం కష్టం.

తమను నమ్మి కీలక బాధ్యతలు ఇచ్చినందుకు వీరిద్ధరు కూడా తమ శాఖలకు 100% బాధ్యత వహిస్తూ న్యాయం చేశారు.


ఆర్థిక మంత్రిగా అరుణ్‌ జైట్లీ బాధ్యతలు చేపట్టాక భారత ఆర్థిక వ్యవస్థలో ఎన్నో సమూల మార్పులు తీసుకొచ్చారు. కొన్ని మార్పులు వివాదాస్పదం అయినప్పటికీ మరి కొన్ని భారత ఆర్థిక రంగ ఔన్నత్యాన్ని చాటి చెప్పాయి.


2016 నవంబరు 8న అనూహ్యంగా తీసుకున్న “పెద్ద నోట్ల రద్దు” తో ఆసేతు శీతాచలం భారత ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురయ్యారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తాయి. ఇక 2017జులై 1నుంచి అమల్లోకి వచ్చిన “వస్తు సేవల పన్ను” సైతం ఎన్నో విమర్శలకు దారితీసింది. అయితే ఒకటి నిజం - చట్టాలు చేయటమే కాదు, వాటిని కఠినంగా అమలు చేయటం లో నరేంద్ర మోడీ సామర్ధ్యం దేశానికి ఋజువైంది. 


2015 లో తీసుకు వచ్చిన గోల్డ్‌ మోనిటైజేషన్‌ పథకం  మంచి స్పందన వచ్చింది. ప్రజల వద్ద ఉన్న బంగారాన్ని ప్రభుత్వం వద్ద దాచిపెట్టుకుంటే దానికి తగిన వడ్డీ చెల్లిస్తారు. షార్ట్‌ టర్మ్‌, మీడియం టర్మ్‌, లాంగ్ టర్మ్‌ ఇలా మూడు విధాలుగా ఉంటుంది. ఈ టర్మ్‌ల ప్రకారం బంగారాన్ని వెనక్కి తీసుకోవాలంటే అప్పుడున్న రేట్లకు అను గుణంగా అంత విలువ చేసే నగదు లేదా బంగారం తిరిగి ఇస్తారు.


బ్యాంకులకు వేల కోట్లరూపాయలు ఎగవేసిన వారిని నియంత్రించేందుకు, ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పరారీ లో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టం తీసుకువచ్చారు దీని ద్వారా విదేశాలకు పారిపోయిన ఋణ ఎగవేతదారులకు ఆర్థిక నేరస్థుడు అనే ముద్ర పడుతుంది. వ్యక్తికి మరోసారి ఋణం ఇవ్వడానికి ఏ బ్యాంకూ ముందుకురావు.


ఋణ ఎగవేతదారుల యావదాస్తులను బ్యాంకులు జప్తు చేసేందుకు వీలుగా దివాలా చట్టం తీసుకువచ్చారు. ఈ చట్టంతో ఋణ ఎగవేతదారుల ఆస్తులను జప్తుజేసి అమ్మి లేదా వేలంవేసి బాధితుల ఋణం చెల్లించటానికి మార్గం సుగమమైంది సులభమైంది. 

విదేశీ వ్యవహారాలు మంత్రిగా సుష్మ స్వరాజ్మదిలో మెదిలితే  భారతీయత మూర్తీభవించే మాతృస్వరూపిణి కనులముందు దర్శనమిస్తుంది. సుష్మా స్వరాజ్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు బాగా దగ్గరయ్యారు. ఆమె వాక్చాతుర్యం, ఆహార్యం, వ్యవహారశైలి, సాత్వికత, కొండొకచో కాఠిన్యత — ఎదుటి వారెవరైనా, ఎంతటివారైనా---వారిని కట్టిపడేస్తాయి. అందుకే ఆమెకు సోషల్‌ మీడియాలో నెటిజన్లు విపరీతంగా ఫాలో అవుతారు. ఇక ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
 
ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో విదేశాంగ మంత్రిగా సుష్మ స్వరాజ్‌ తొలి విజయాన్ని అందుకున్నారు. ఇరాన్‌, సిరియాలోని ఐసిస్‌ ఉగ్రవాదుల కభంద హస్తాల్లో చిక్కుకున్న 46 మంది భారతీయ నర్సులను సుష్మా స్వరాజ్‌ విడిపించి స్వదేశానికి తీసుకొచ్చారు. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అద్భుత ప్రజావిశ్వాసం తెచ్చిపెట్టింది
వేల కోట్ల రూపాయిలు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న దేశ ఆర్ధిక ద్రోహులను ఋణ ఎగవేతదారులను స్వదేశానికి తెచ్చేందుకు సుష్మ స్వరాజ్‌ పడిన శ్రమ వర్ణనాతీతం. ఐదేళ్లలో 18 మందిని ఆర్ధిక నేరగాళ్ళను వెనక్కి తీసుకొచ్చారు. ఇది ఒక రికార్డు. 

ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన భారతీయులు ఇబ్బందులు పడుతున్నట్లు సుష్మ స్వరాజ్‌ కు తెలిస్తే వెంటనే స్పందించే వారు. సంబంధిత ప్రభుత్వాలతో మాట్లాడి వారినికి వెనక్కి రప్పించేవారు. ఈ విషయమై ట్విటర్‌ లో ఎవరు ఎలాంటి అభ్యర్థన చేసినా ఆమె వెంటనే స్పందించే వారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ అధికారులనే కాదు అధినేతలను సైతం తన భాషా చాతుర్యం, తనకే సాధ్యమైన స్నేహశీలతతో వారి ఆదరాభిమానాలు చూరగొని అనుకున్నది సాధించేవారు.


ఇక విదేశాల్లో గృహహింస ఎదుర్కొంటున్న భారతీయ మహిళల కోసం,  స్త్రీ శిశు సంక్షేమ శాఖతో కలిసి సుష్మ చొరవ తీసుకుని చట్టాన్ని తీసుకువచ్చారు. దీని ప్రకారం సదరు వ్యక్తి గృహహింస పెట్టినట్లు తేలితే అతడి వీసా రద్దు చేస్తారు. దీంతో పాటు భారత్‌ లో ఉన్నవ్యక్తిగత ఆస్తులను సైతం స్వాధీనం చేసుకుంటారు. 

ప్రధాని నరేంద్ర మోదీ తొలి ప్రభుత్వంలో ఇన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఈ ఇద్దరి స్థానాన్ని కొత్త ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్, సిబ్రమణ్యం జైశంకర్ భర్తీ చేస్తారనే ఆశిద్ధాం. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: