పాపం .. సుజనాకు అప్పుడే బీజేపీ షాక్ ఇచ్చింది ..!
బీజేపీలోకి సుజనా చౌదరి ఎందుకు చేరారో అందరికీ తెలిసిందే. తన మీద ఉన్న కేసులను తప్పించుకోవటానికి బీజేపీలోకి చేరారు. అయితే టీడీపీ రాజ్యసభ లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తూ టీడీపీ రాజ్యసభ పక్ష నాయకుడి హోదాలో సుజనా చౌదరి అందజేసిన లేఖ ప్రకారం రాజ్యాంగంలోని 10వ షెడ్యూలులోని 4వ పేరాను అనుసరించి రాష్ట్రపతి విలీనం చేశారు. ఇంత చేసిన సుజనా చౌదరికి ఆయనపై ఉన్న ఆర్థిక అభియోగాల విషయంలో ఉపశమనం దక్కుతుందనుకుంటే..తిరిగి షాక్ తగింది.
సుజనాచౌదరిపై తీవ్రమైన ఆర్థిక అభియోగాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈడీ విచారణను సైతం ఆయన గ్రూపు ఎదుర్కుంటోంది. దీంతో ఈ కేసుల నుంచి ఉపశమనం కోసమే...సుజనా బీజేపీలో చేరారనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అభియోగాలు ఉండి తమ పార్టీలో చేరుతున్న టీడీపీ ఎంపీలకు తాము ఎటువంటి హామీలు ఇవ్వలేదని, రాజ్యసభలో తమ సంఖ్యాబలం తక్కువగా ఉన్నందునే తెలుగుదేశం సభ్యులను చేర్చుకున్నట్లు స్పష్టం చేశారు. గుంటూరులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో తాను టీడీపీ రాజ్యసభ సభ్యులను విమర్శించింది నిజమేనని, వారు కూడా తమను విమర్శించారన్నారు. వారిపై వచ్చిన అభియోగాలపై వారే సమాధానం చెప్తారని, తమ పార్టీలో చేరిన వారికి మంచివారు అని తాము సర్టిఫికెట్లు ఇవ్వలేదన్నారు.