నేటి సమాజంలో సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పార్టీల వ్యవహార శైలి, నాయకుల దూకుడు వంటివాటిపై ఎప్పటికప్పుడు తమదైన శైలిలో ప్రజలు సోషల్ మీడియాలో కామెంట్లను కుమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ నిర్వహించిన తొలి కలెక్టర్ల సదస్సు విషయంపైనా సోషల్ మీడియాలో కామెంట్లు కుమ్మరిస్తున్నారు. అయితే, ఇవన్నీ కూడా జగన్కు పాజిటివ్గానే కావడం గమనార్హం.
``సూటిగా సుత్తి లేకుండా.. ఇరగదీసావ్ బాస్`` అనే కామెంట్లు కోకొల్లలుగా పడిపోతున్నాయి. నిజమే! తొలిసారి కలెక్టర్ల సదస్సును నిర్వహించిన జగన్.. తన సొంత డబ్బాను ఎక్కడా కొట్టుకోలేదు. ప్రజలు ఏం కోరుతున్నారు-మనం ఏంచేయాలి!- అనే ఏకైక అజెండాతోనే ఆయన కార్యక్రమం మొత్తం మాట్లాడారు. ప్రజలు అవినీతిలేని ప్రభుత్వాన్ని, పాలనను కోరుతున్నారని కుండబద్దలు కొట్టారు. ఆదిశగా మన ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించిన జగన్.. తన మనసులోని మాటను స్పష్టం చేశారు.
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎంతటి వాడైనా.. సరే అవినీతి పాల్పడితే.. తాట తీయాల్సిందేనని కలెక్టర్లకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. అదేవిధంగా మీరు కూడా అవినీతి రహితంగా ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు. పుడితే లంచం, ఛస్తే.. లంచం అనే సంస్కృతికి చరమ గీతం పాడాలని స్పష్టం చేశారు.
నవరత్నాలకు సంబంధించిన మేనిఫెస్టోను ప్రతి ఒక్కరూ విధిగా తమదగ్గర ఉంచుకోవాలని సూచించారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలని, ప్రజలే మనకు దేవుళ్లు అని దిశానిర్దేశం చేశారు.
ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు, కార్యాలయాల చుట్టూ తిరగకూడదు, లంచాలు అనే మాట వినిపించకూడదు. అని జగన్ స్పష్టం చేశారు. ఈ మొత్తం పరిణామం కూడా కేవలం రెండున్నర గంటల్లోనే పూర్తికావడం విశేషం. తాను చెప్పాలని అనుకున్న విషయాన్ని, ప్రజల మనసుల్లో ఏముందో అనే విషయాన్ని, ప్రజలకుమనం ఏం చేయాలి? అనే విషయాన్ని జగన్ స్పష్టం చేశారు. దీంతో ఆయన సోషల్ మీడియాలో ప్రజలు జేజేలు కొడుతున్నారు. అన్నా నువ్వే మళ్లీ సీఎం .. అంటూ కామెంట్లు పెడుతున్నారు.