కృష్ణా జిల్లాలో 18 ఏళ్ల అబ్బాయి... 17 ఏళ్ల అమ్మాయి ప్రేమకథ మూడు నెలల ముచ్చటగానే ముగిసిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరి మధ్య మనస్పర్థలు రావడంతో అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది. ప్రభుత్వం ప్రచారం ఎంత చేస్తున్నా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని ఏ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం గ్రామశివారు కేసియా తండాకు చెందిన జరబల రవీంద్రనాయక్ (18), చీమలపాడు పెదతండాకు చెందిన జరబల రత్నకుమారి(17) ప్రేమించుకున్నారు.
వీరిద్దరు చీమలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుతున్నారు. హైస్కూల్లో చదువుకున్న రోజుల నుంచే వీరు ప్రేమించుకోవడంతో పెద్దలను ఒప్పించి మూడు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికి మైనార్టీ తీరకుండానే పెద్దలు పెళ్లి చేసేశారు. జీవితంపై సరిగా అనుభవం లేకుండానే పెళ్లి చేయడంతో వీరి జీవితంలో పెళ్లయిన కొద్ది రోజులకే మనస్పర్థలు వచ్చాయి.
రత్నకుమారి వివాహం అనంతరం కేసియా తండాలోని అత్తింటిలో కాపురం చేస్తుంది. మూడో నెలలకే ఆమెకు అత్తింటి ఆరళ్లు ఎక్కువయ్యాయి. భర్త, కుటుంబ సభ్యులు ఆమెను మానసిక, శారీరకంగా వేధించడంతో మంగళవారం ఉదయం ఇంటివద్దే ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు రత్నకుమారిని సమీపంలో ప్రైవేట్ వైద్యుడి వద్దకు తీసుకు వెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
అత్తింటి వేధింపుల వల్లే తమ కుమార్తె చనిపోయిందని రత్నకుమారి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఏదేమైనా బాల్య వివాహాల వల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయో... పరిపక్వత లేని జీవితం ఎలా ఉంటుందో ? ఈ సంఘటనే మరోసారి రుజువు చేసింది.