చంద్రమండలం మీదకు ఉపగ్రహాన్ని పంపి పరిశోధనలు చేయాలన్నది ఇండియా కల. ప్రపంచంలో చాలా దేశాలు ఉపగ్రహాలను పంపిస్తున్నాయి. కానీ, చంద్రుని మీదకు ఉపగ్రహాలను పంపిన దేశాలు చాలా కొద్దిమాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇండియా ఆ దేశాల పక్కన చేరబోతున్నది.
మార్స్ మీదకు మామ్ ఉపగ్రహాన్ని పంపి విజయవంతమైన ఇండియా ఇప్పుడు చంద్రయాన్ 2 ప్రయోగానికి సిద్ధం అయ్యింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత... సోమవారం వేకువజామున 2.51 గంటలకు జీఎస్ఎల్వీ- మార్క్ 3 ఎం1 వాహక నౌక ద్వారా చంద్రయాన్ -2ని రోదసీలోకి పంపనున్నారు.
ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 6.51 గంటలకు ప్రారంభం అయ్యింది. ఇది నిరంతరాయంగా 20 గంటలపాటు కొనసాగిన తరువాత జీఎస్ఎల్వీ- మార్క్3 ఎం1 నింగిలోకి దూసుకెళ్లనుంది. చంద్రయాన్-2 ఉపగ్రహంలో రోవర్, ల్యాండర్, ఆర్బిటర్ అనుసంధానం చేశారు. దీని బరువు 3,447 కిలోలు. ఇందులో ప్రొపెల్లర్ బరువు 1179 కిలోలు.
షార్ కేంద్రం నుంచి ప్రయోగం చంద్రయాన్ 2 ప్రయోగం జరిగిన తరువాత 3.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిని సెప్టెంబర్ 5,6 తేదీల్లో చేరుకుంటుంది. చంద్రయాన్ 2 ఉపగ్రహంలో ల్యాండర్, రోవర్ అనే రెండు ఉన్నాయి. ఇక, చంద్రయాన్-2 ఉపగ్రహ తయారీకి రూ.603 కోట్లు ఖర్చు చేయగా, జీఎస్ఎల్వీ-మార్క్ఎం1 వాహక నౌక రూపకల్పనకు రూ.375 కోట్లు ఖర్చు అయినట్టు ఇస్రో తెలియజేసింది.