తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి టార్గెట్ కేసీఆర్ అన్నట్లుగా సాగుతున్న తెలంగాణ జన సమితి(టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం ఇదే ఒరవడిలో మరో కీలక ప్రకటన చేశారు. తన పోరాటానికి తోడుగా, ఏకంగా ఢిల్లీకి చెందిన నాయకులతో కలిసి కేసీఆర్ పరిపాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని టీజేఎస్ తొలి ప్లీనరీ జరిగింది. ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా స్వరాజ్ అభియాన్ పార్టీ నేత యోగేంద్రనాథ్ యాదవ్ పాల్గొన్నారు. కేసీఆర్ కూడా ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్నారని, అయితే ప్రజలు తిరగబడే రోజు వస్తుందన్నారు.
దేశవ్యాప్తంగా ఆదీవాసులు, రైతులు తిరుగుబాటు చేస్తున్నారని స్వరాజ్ అభియాన్ పార్టీ జాతీయ నాయకులు యోగింద్రయాదవ్ ప్రకటించారు. నిరుద్యోగులు కూడా తిరగబడే రోజు వస్తుందని చెప్పారు. రాష్ట్రంలోనూ నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున ఉందన్నారు. దేశంలో అన్ని వ్యవస్థల విధ్వంసం జరుగుతున్నదని,ఆ పునాదులపైనే విశ్వాసాన్ని కూడగట్టాల్సిన అవసరముందన్నారు. దేశంలో ప్రత్యామ్నాయంగా ప్రజలకు ఒక గొంతు అవసరమన్నారు. రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను ప్రధాని మోడీ కూల్చేస్తున్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ప్రజలను కేంద్రీకృతంగా చేసి హక్కుల కోసం పోరాటం చేయడమే టీజేఎస్ ముందున్న లక్ష్యమన్నారు. ఉన్న సచివాలయాన్ని కూల్చి కొత్తది కడుతున్నారని, కానీ అమరవీరులకు స్మతివనం కట్టడం లేదని విమర్శించారు. ప్రాజెక్టుల పేర ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సాధన ప్రజలందరి పోరాటంతోనే సాధ్యమైందని, ఏ ఒక్కరితో రాలేదని.. అలా ఎవరైనా చెబితే అది అబద్ధమే అవుతుందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించిందనీ, అమరులను మరచిందనీ విమర్శించారు. ఆచార్య జయశంకర్ చూపిన బాటలోనే తెలంగాణ జనసమితి (టీజేఎస్) నడుస్తున్నదని, ప్రతి కార్యకర్తా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.