వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం చేపట్టి తనదైన శైలిలో ప్రజారంజక పాలనతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో వైఎస్ జగన్ ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తద్వారా దేశం చూపును తనవైపు తిప్పుకొంటున్నారు. ఇలా దాదాపు నెలన్నరోజుల్లోనే తన ముద్ర వేసుకున్న వైఎస్ జగన్ తొలిసారిగా విదేశీ యాత్రకు సిద్ధమయ్యారు. వచ్చే నెలలో వైఎస్ జగన్ అమెరికాలో పర్యటించనున్నారు.
ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తొలిసారి విదేశీ పర్యటనకు వచ్చే నెలలో వెళ్లనున్నారు. రాబోయే ఆగస్టులో తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ యూఎస్ వెళ్లనున్నారు. ఆగస్టు 17 నుంచి 23వ తేదీ వరకు వైఎస్ జగన్ ఫ్యామిలీ పర్యటన కొనసాగనుంది. డెట్రాయిట్లో ఎన్ఆర్ఐలు నిర్వహించే ఆత్మీయసభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాలను జగన్ వివరించనున్నారు. దీంతో పాటుగా ఎన్నారైల సంక్షేమం కోసం తాము తీసుకునే నిర్ణయాలను వెళ్లడించనున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎన్నారైలు కలిసి రావాల్సిన ఆవశ్యకతను ఆయన చాటిచెప్పనున్నారు.
మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో, అమెరికాలోని ఎన్నారైలు వివిధ అంశాలపై ఆయనతో చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఎన్నారైల సంక్షేమం పేరుతో జరిగిన కార్యక్రమాల్లో కొందరి నిధుల దుర్వినియోగం, ఉద్దేశపూర్వకంగా కొందరికే ప్రయోజనం చేకూర్చడం వంటి ఆయన దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రస్తుత ప్రభుత్వం హయాంలో అలాంటివి జరగకుండా అందరికీ ప్రయోజనం కలిగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.