తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్పై మాజీమంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ గెలుపు ఒక గెలుపేనా అని సీఎం కేసీఆర్ చేసి వ్యాఖ్యలపై స్పందిస్తూ... కేసీఆర్పై విరుచుకుపడ్డారు.వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తదని.. ప్రజలు కూడా బీజేపీని బలోపేతం చేస్తున్నారని అన్నారు డీకే అరుణ. మోడీ, అమిత్ షాల దృష్టి తెలంగాణ పై ఉందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు మోడీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుంది కాబట్టే పనులు ముందుకెళ్లాయని అన్నారు. కేసీఆర్ చేసిన అవినీతి బట్టబయలు చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పారు.
జ్యోతిష్యులు చెప్పారని కేసీఆర్ ప్రధాని కావాలని ప్రయత్నించారని అరుణ ఆరోపించారు. అందుకే ఫెడరల్ ఫ్రంట్ అంటూ రాష్ట్రాలన్ని తిరుగుతూ తనను ప్రధానిని చేయాలని ఆయా నాయకులను కోరారని తెలిపారు. దీంతో పాటే ధనాన్నికూడా పలువురు రాష్ట్ర నాయకులకు అందజేశారని అన్నారు. కేసీఆర్ ప్రధాని అవడమేమో కానీ.. ఆయను బిడ్డను కూడా ఎంపీగా గెలిపించుకోలేకపోయారని చెప్పారు. మోడీ అంటే కేసీఆర్ కు భయం పట్టుకుందని ఆరోపించారు. వర్షాలు లేక పంటలు ఎండి పోతుంటే… కేసీఆర్ కనీసం సమీక్ష కూడా నిర్వహించడం లేదని డీకే అరుణ మండిపడ్డారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని అణచివేత ధోరణి కొనసాగుతోందని అన్నారు .
ఆదరాబాదరాగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు పోతోందని అరుణ ఆరోపించారు. కొత్త మున్సిపల్ చట్టం పేరుతో ప్రభుత్వం స్థానిక సంస్థల అధికారాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నారని అరుణ అన్నారు. మున్సిపాలిటీ కొత్త చట్టం ద్వారా మున్సిపాలిటీ కౌన్సిలర్లకు ఎలాంటి అధికారాలు లేవని డీకే అరుణ చెప్పారు . రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న మున్సిపాలిటీలకే నిధులు ఇవ్వడం లేదని… పెంచిన వాటికి ఏం ఇస్తారని అన్నారు.