వై.ఎస్. జగన్.. అన్నంత పని చేస్తున్నాడుగా..?
మాట ఇస్తే తప్పే అలవాటు లేదని తరచూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటుంటారు. చేయ గలిగేదే చెబుతానని కూడా ఆయన అంటుంటారు. ఇప్పుడు జగన్ అదే పని చేస్తున్నారు. ఎన్నికల ముందు చెప్పిన మాటను తూచా తప్పకుండా అమలు చేయబోతున్నారు. ఇంతకీ ఏ విషయం అంటారా..?
అదే మద్యపాన నిషేధం అంశం. రాష్ట్రంలో విడతల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తానని ఎన్నికల ముందు చెప్పారు. బెల్టు షాపులు తీసేస్తానన్నారు. ఫైవ్ స్టార్ హోటళ్లలో తప్ప మద్యం దొరికే పరిస్థితి లేకుండా చేయాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
అందులో భాగంగా.. ఆంధ్ర ప్రదేశ్లో ఈ ఏడాది 880 మద్యం షాపులను తగ్గిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4380 మద్యం షాపులు ఉన్నాయి. దశల వారీగా మద్య నిషేధం అమల్లో భాగంగా మొదటి విడతలో 20 శాతం దుకాణాల్ని తగ్గించాలని జగన్ సర్కారు ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్తో షాపులకు ఇచ్చిన లైసెన్సు రెన్యువల్ గడువు ముగుస్తుంది.
అక్టోబర్ నుంచి అమల్లోకి తెచ్చే నూతన మద్యం పాలసీలో తగ్గించిన మేరకు 3,500 మద్యం షాపుల్ని ప్రభుత్వమే నిర్వహించేందుకు కసరత్తు చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం చేతిలో దుకాణాలుండటం వల్ల మద్య నియంత్రణకు మార్గం సులువవుతుందని, నిబంధనల ఉల్లంఘనలు కూడా ఉండవని జగన్ భావిన్నారు.
అక్టోబర్ నాటికి రాష్ట్రంలో ఒక్క బెల్టు షాపు కూడా కనిపించకూడదని సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. జాతీయ, రాష్ట్ర రహదారులకు, గుడికి, బడికి దగ్గర లేకుండా చూడాలన్నారు. ఇలా క్రమంగా ఒక్కో అడుగు వేసుకుంటూ వచ్చే ఐదేళ్లలో మద్యం మహమ్మారిని కట్టడి చేయాలన్నది జగన్ టార్గెట్. మరి ఏ మేరకు సక్సస్ అవుతారో చూడాలి.