విజయవాడ రాజకీయాల్లో ఎంపీ కేశినేని నాని వర్సెస్ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వార్ సోషల్ మీడియా వేదికగా మాంచి రక్తికట్టింది. ఇప్పుడు వెంకన్న పార్టీ సూచనల మేరకు డ్రాప్ అయిపోగా వెంటనే వైసీపీ నేత పీవీపీ దూరేశారు. పీవీపీ కొద్ది రోజులుగా తనపై గెలిచిన నానిని టార్గెట్గా చేసుకుని తీవ్రమైన విమర్శలు, సెటైర్లు వేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఒక లెక్క.... ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా పీవీపీ తాజాగా ట్రెండ్ ఫాలో అవుతూ మరీ నానిపై సెటైర్ ట్వీట్లు వేస్తున్నారు.
ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ను ఫాలో అవుతూ విమర్శలు చేస్తే ప్రజల్లోకి అవి మరింతగా పోతాయన్నట్టుగానే పీవీపీ తాజా ట్వీట్ చేశారు. ఇక పాపులర్ సినిమాలను వాడుకుంటూ విమర్శలు చేయడం రాజకీయ నాయకులకు కొత్తేం కాదు. బాహుబలి సినిమా సమయంలో కూడా... కట్టప్ప, బాహుబలి, భల్లాలదేవ అంటూ గత ప్రభుత్వ హయాంలో తీవ్రమైన విమర్శలు చేసుకున్నారు.
ఇక ఇప్పుడు పీవీపీ నానిని టార్గెట్ చేసేందుకు యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ - పూరి జగన్నాథ్ లేటెస్ట్ హిట్ ఇస్మార్ట్ శంకర్ను వాడుకున్నారు. కేశినేని నానిని ‘ఇస్మార్ నాని’ అంటూ కామెంట్ చేశాడు. నానితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబును సైతం పీవీపీ టార్గెట్గా చేసుకుని విమర్శలు చేశారు. అమెరికాలో పర్యటించిన సందర్భంగా చంద్రబాబు రోడ్ల మీద పాప్ కార్న్ తింటూ కులాసాగా తిరుగుతుంటే, ఆయన సహచరుడు ఇస్మార్ట్ నాని (కేశినేని నాని) మాత్రం వ్యాపారాలు మూసేసి అందరినీ రోడ్డున పడేస్తున్నారని విమర్శించారు.
నాని బెజవాడను దివాళా తీయించాడని కూడా మండిపడ్డారు. ఆయన గురువు చంద్రబాబు వెంటనే హెరిటేజ్ పాలు పంపిస్తే, బారులు తీరిన అప్పుల వాళ్లకు ఓ కప్పు కాఫీ ఇస్తామని ఎద్దేవా చేశారు. అలాగే పీవీపీ ఈ ట్వీట్కు కేశినేని కార్గో వ్యాపారాన్ని స్వాధీనం చేసుకుంటూ కెనరా బ్యాంకు జారీచేసిన స్వాధీన ప్రకటనను పీవీపీ జత చేశారు. వెంకన్న వర్సెస్ నాని వార్ ముగిసింది. మరి పీవీపీ వర్సెస్ నాని వార్కు ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందో ? చూడాలి.