అమెరికాలో కొంత కాలంగా తెలుగు వారికి పూర్తిగా రక్షణ లేకుండా పోయిందని చెప్పడానికి ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. జాతి వివక్షతో కొంత మంది అయితే..డబ్బు కోసం విచక్షణా రహితంగా కాలుస్తున్నారు. అయితే కేవలం తెలుగు వారే కాదు అమెరికాలో సామాన్యులపై కొంత మంది ఉన్మాదులు కాల్పులకు తెగబడుతున్నారు. అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఓహియోలోని డేటన్లో ఉన్మాది కాల్పుల్లో 10 మంది మరణించగా.. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
ఈఘటన నుంచి తేరుకోక ముందే కొంత మంది ఉన్మాదులు తుపాకులతో వాల్ మార్ట్ స్టోర్ లోకి చొరబడ్డారు. అక్కడ కనిపించిన వారిపై చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కాల్పులకు తెగబడ్డారు. ఆ ఉన్మాదుల కాల్పుల్లో ఏకంగా 20 మంది చనిపోయారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ వీడియో ట్విట్టర్ లో ఓ వ్యక్తి పోస్ట్ చేశారు. దుండగుల్లో ముగ్గురు హంతకులు పోలీసుల అదుపులో ఉన్నట్లు ఎల్పాసో మేయర్ డీ మార్గో తెలిపారు. అయితే గాయపడ్డ వారి వారి సంఖ్య కచ్చితంగా తెలీరాలేదని టెక్సాస్ లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ ప్యాట్రిక్ ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు.
కాగా ఏడు రోజుల వ్యవధిలోనే టెక్సాల్ లో రెండోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. వరుస ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గత కొంత కాలంగా అమెరికాలో గన్ కల్చర్ బాగా పెరిగిపోయిందని..మైనర్లకు సైతం గన్ లైసెన్స్ ఇవ్వడం..విచ్చలవిడిగా గన్స్ అమ్మడం ఈ అనర్థాలకు దారి తీస్తుందని అక్కడి ప్రజానికం ఎన్ని సార్లు విమర్శలు చేస్తున్నారు. దీనికి తోడు ఉగ్రవాదులు అమెరికాలో ఎక్కడ ఎటాక్ చేస్తారో అన్న భయంతో ప్రతిరోజూ భయం భయంగానే గడుపుతున్నారు అమెరికా ప్రజలు. ప్రపంచ దేశాల నుంచి అమెరికాలో బతుకు దెరువు కోసం పోయి తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అమాయక ప్రజలు.