ప్రతీకారం తోనే ఈడి దాడులా...?
కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం పై ఈడి దాడుల వెనుక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నారా? అంటే అవుననే వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర హోం మంత్రి చిదంబరం ఒక వెలుగు వెలిగారు. ఆ సమయంలో గుజరాత్ హోంమంత్రిగా ఉన్న అమిత్ షా పై పలు కేసులు నమోదు చేయించడమే కాకుండా నిందితుడిగా అరెస్ట్ చేయించి జైల్లో వేయించారని ఆరోపణలు చిదంబరంపై ఉన్నాయి. సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ లో అమిత్ షా హస్తం ఉందన్న ఆరోపణలు సైతం వినిపించాయి.
సోహ్రాబుద్దీన్ ఆయన భార్య కౌసర్ బి మరొక వ్యక్తిని పట్టుకొని గుజరాత్ పోలీసులు కాల్చి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన దేశ రాజకీయాల్లో ఇప్పటికే సంచలనమే. ఈ కేసులో నిందితుడిగా అమిత్ షా మూడు నెలల పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఆ తర్వాత ఆయన గుజరాత్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం తో జైలు నుంచి బయటికి వచ్చారు. అయితే ఈ పదేళ్లలో రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆనాడు గుజరాత్ హోంమంత్రిగా ఉన్న అమిత్ షా , ప్రస్తుతం కేంద్రం హోంశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు . దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ఆయన కీలక వ్యక్తిగా మారారు . గతం లో కేంద్రంలో చక్రం తిప్పిన చిదంబరం ప్రస్తుతం కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.
అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్ష నేతల పై ప్రతీకార చర్యలకు దిగడం అన్నది ఇటీవల కాలం లో సర్వసాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో తనను జైలుకు పంపించిన చిదంబరంను ఎలాగైనా కేసుల్లో ఇరికించి జైలుకు పంపి ప్రతీకారాన్ని తీసుకోవాలని అమిత్ షా చూస్తున్నారన్న టాక్ పొలిటికల్ సర్కిల్ లో విన్పిస్తోంది . ఈ నేపథ్యంలోనే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరంపై తాజాగా అమిత్ షా ప్రమేయంతోనే ఈడి దాడులకు దిగిందని వారంటున్నారు.