ఎవరైనా ఓడిపోతే ఏం చేస్తారు.. ఎందుకు ఓడిపోయారు.. కారణాలు ఏంటి.. ప్రచారం సమయంలో ఏవైనా తేడాలు ఉన్నాయా అని సరిచూసుకుని వాటికీ తగ్గట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ, సమాజ్ వాదీ పార్టీ మాత్రం అందుకు వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలు పెట్టింది. గత ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.
2017 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలకు గాను బీజేపీ 312స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చింది. సమాజ్ వాదీ పార్టీ కేవలం 47 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బహుజన సమాజ్ వాదీ పార్టీ 19 సీట్లు గెలుచుకుంది. దీంతో సమాజ్ వాదీ పార్టీ చాలా ఇబ్బంది పడింది. ఎలాగైనా పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని చూసింది.
కానీ, 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 80 స్థానాలకు గాను 62 చోట్ల బీజేపీ విజయడంకా మోగించింది. సమాజ్ వాది పార్టీ కేవలం 5 స్థానాలే గెలుచుకుంది. అదీ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం వలన. పైగా సమాజ్ వాదీ పార్టీ నేత, అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కూడా ఆ ఎన్నికల్లో ఓడిపోవడం పార్టీని కలిచివేసింది. మరో రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే మాములు విషయం కాదు.
అందుకే ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు సిద్ధం అయ్యింది. పార్టీ అధ్యక్షులు మినహా మిగతా అందరిని పక్కన పెట్టింది. త్వరలోనే అన్ని పదవులకు కొత్తవారిని నియమించాలని చూస్తోంది. ఈ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించబోతున్నది. అయితే, ఇటు యోగి ఆదిత్యనాథ్ ఇటీవలే తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ పదవులు కట్టబెట్టారు. ఇది సమాజ్ వాదీ పార్టీకి పెద్ద దెబ్బ కావొచ్చు.