సుమారు రెండున్నర దశాబ్ధాలుగా తన ఆధ్మాత్మిక ప్రవచనాల ద్వారా తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోకూడా ప్రత్యేక గుర్తింపు పొందారు ఆ స్వామీజీ.. 2018 ఎన్నికలకు ముందు బీజేపీయే స్వయంగా ఆయన్ను ఆహ్వానించి, ఎన్నకల్లో పార్టీ విజయం సాధిస్తే, ముఖ్యమంత్రి పదవి కట్టబెడతామని కూడా హామీ ఇచ్చింది. అయితే కథ అడ్డం తిరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత , స్టార్ క్యాంపెయినర్గా దూసుకెళ్లిన ఆ స్వామిజీ ఇప్పుడెక్కడా కనిపించడంలేదు. ఎన్నికల ప్రచారంలో దుమ్మురేపి భావోద్వేగాలతో రెచ్చగొట్టిన పరిపూర్ణానంద పత్తాలేకుండా పోయాడు.
పార్టీలో చేరిందే తడువుగా తెలంగాణలో తెగ హడావిడి చేశారు పరిపూర్ణానంద. మతం, జాతీయవాదమే అం శాలుగా కాంగ్రెస్, టీఆర్ఎస్పై చెలరేగిపోయారు. పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్తో పోటాపోటీగా, సభలు సమావేశాలు నిర్వహించారు. చాలా అసెంబ్లీ నియోజికవర్గాల్లో రోడ్ షోలతో, పార్టీ అనధికార స్టార్ క్యాంపెయినర్గా చక్రం తిప్పారు. సొంత హెలికాఫ్టర్పై తిరిగి ప్రచారాన్ని హోరెత్తించారు.
ఆయన పార్టీకి భవిష్యత్తులో అధికారం కట్టబెడతారని అందరూ అంచనా వేశారు కూడా. అయితే సీన్ రివర్స్ అయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. గతంలో ఉన్న సీట్లను కూడా చేజార్చుకొని ఒక్కసీటుకే పరిమితమైంది. స్వామిజీ తిరిగిన ఏ నియోజకవర్గంలోనూ బీజేపీ గెలవలేదు. చాలా చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు. తన ప్రయోగం విఫలం కావడంతో ఒక్కసారిగా కలత చెందారట స్వామి పరిపూర్ణానంద. ఏదేదో ఊహించుకున్న పార్టీ అధిష్టానం కూడా, స్వామిజీ ప్రభావం శూన్యమేనని భావించి, ప్రాధాన్యత తగ్గించిందట. దీంతో స్వామిజీ కూడా పార్టీకి దూరం జరిగారు. ఇప్పుడెక్కడా కనిపించకుండా పోయారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర పరాభవంతో, రాజకీయాలకు స్వామిజీ దూరం జరిగిన తర్వాత, పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. అయితే అసెంబ్లీ అనుభవంతో, లోక్సభ ఎలక్షన్స్ క్యాంపెయిన్ను అసలు ముట్టుకోలేదు పరిపూర్ణానంద. అసెంబ్లీ పోరులో ఘోరంగా ఓడింది, ఇక పార్లమెంట్లో ఒక్క సీటూ రాదని స్వామిజీ వర్గం అంచనా వేసిందట. అయితే, ఈసారి కూడా అంచనా తప్పింది. పార్లమెంట్ పోరులో, అందరి అంచనాలను తిప్పికొట్టింది బీజేపీ. నాలుగు ఎంపీ స్థానాలతో వారెవ్వా అనిపించింది.
దీంతో మరోసారి అవాక్కవడం స్వామిజీ వంతయ్యింది. ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో స్వామిజీ ప్రచారం చేసి వుంటే, తన వల్లే నాలుగు ఎంపీ స్థానాలు వచ్చాయని చెప్పుకునే అవకాశం దక్కేది. పార్టీలో భవిష్యత్ లీడర్గా ఒక వెలుగు వెలిగేవారు. కానీ ప్రచారం చేయలేదు కాబట్టి, చెప్పుకునే ఛాన్సేలేదు. పాపం స్వామిజీ అంటున్నారట బీజేపీ కార్యకర్తలు.