ఏపీలో అధికారం కోల్పోయినప్పటినుంచి విపక్ష టిడిపి నేతలు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారాన్ని అడ్డంపెట్టుకుని మాజీ స్పీకర్ కోడెల ఫ్యామిలీ ఐదు సంవత్సరాలపాటు ఎలాంటి అరాచకాలకు పాల్పడింది చూస్తూనే ఉన్నాం. కోడెల ఫ్యామిలీ చేసిన అరాచకాలు రోజుకొక్కటి చొప్పున బయటకు వస్తున్నాయి. ఇక గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పై ఏకంగా సిబిఐ విచారణకు రంగం సిద్ధం అవుతోంది. అక్రమ మైనింగ్ కేసులో ఆయన తీవ్రంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై ఏకంగా ఫోర్జరీ కేసు నమోదయింది. ఓ భూమి విషయంలో ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించి విక్రయించినట్లు సోమిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో పామర్రు పిచ్చిరెడ్డికి సర్వే నెంబర్లు 581 - 583 మొత్తం 13.71ఎకరాల భూమి ఉంది. అయితే ఇందులో 10.94 ఎకరాలకు పంపకాలు సరిగా జరగలేదనే వివాదం ఉంది. ఈ వివాదం అప్పుడు మంత్రిగా ఉన్న సోమిరెడ్డి వద్దకు చేరింది.
ఇదే అదనుగా ఈ భూమిలో కొంత కొట్టేయాలన్న ప్లాన్ ఆయన వేశారు. సర్వే నంబరు 583 ప్రకారం ఉన్న 2.36 ఎకరాల భూమిని అధికారులపై ఒత్తిడి చేసి ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ అయ్యేలా చక్రం తిప్పారు. ఆ తర్వాత ఆ భూమిని చెన్నై నగరానికి చెందిన మేఘనాథన్ - ఏఎం జయంతిలకు అమ్మేశారు. దీంతో షాక్ తిన్న బాధితుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే కోర్టును ఆశ్రయించాడు.
ఎట్టకేలకు ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు సోమిరెడ్డితోపాటు వీఆర్ మేఘనాథన్ - ఏఎం జయంతి - సర్వేయర్ సుబ్బరాయుడులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసులు వారిపై 471 - 468 - 447 - 427 - 397 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు వ్యవహారంపై సోమిరెడ్డి స్పందించలేదు. ఆయన లాయర్లతో చర్చించి న్యాయ సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.