వైసీపీ ఏపీలో టీడీపీ నేతలను టార్గెట్ చేసేందుకు రెడీ అయ్యింది. కొద్ది రోజుల వరకు టీడీపీ నేతలను చేర్చుకునే విషయంలో కాస్త ముందు వెనక ఆలోచించిన సీఎం జగన్మోహన్రెడ్డి ఇక బీజేపీ మరో వైపు నుంచి తరుము కొస్తుండడంతో గేట్లు ఎత్తేసినట్టే కనపడుతోంది. ఇప్పటికే విశాఖ జిల్లా నుంచి పలువరు కీలక నేతలు వైసీపీలో చేరగా... ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా వంతు వచ్చింది. ఆ జిల్లా నుంచి పలువురు టీడీపీ కాపు నేతలు వైసీపీలో చేరుతున్నారు.
ముందుగా సీనియర్ నేత తోట త్రిమూర్తులు ఆదివారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఇక ఇప్పుడు ప్రత్తిపాడు టీడీపీ మాజీ నేత వరుపుల రాజా సైతం వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నాడు. ఇక తాజాగా మరింత మంది కాపు నేతలను వైసీపీలోకి తీసుకు వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తోట పార్టీలో చేరిన సందర్భంగా ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఊతమిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి త్వరలో వైసీపీలో చేరేందుకు అనేక మంది నేతలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు.
జగన్ కు భయపడే కాపు నేతలు ఆయన వెంట వెళుతున్నారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఆమంచి కృష్ణమోహన్ ఖండించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా జగన్ పాలనను ప్రశంసిస్తున్నాయని.. చంద్రబాబుతో పాటు ఆయన పార్టీపై నమ్మకం లేకే చాలా మంది నేతలు వైసీపీలో చేరుతున్నారని.. ఇంకా చేరతారని కూడా ఆమంచి చెప్పారు. ఈ భారీ చేరికలు త్వరలోనే ఉంటాయన్న ఆమంచి మరో మూడు నెలల్లో ఎవరెవరు నేతలు టీడీపీకి షాక్ ఇస్తారో ? మీరే చూస్తారన్నారు.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ఆపరేషన్ ఆమంచి మాటేమోగాని భవిష్యత్తులో తెలుగుదేశం పాార్టీ కనుమరుగవుతుందని తెలిపారు. ఇదే క్రమంలో పలువురు కాపు నేతలు ఆమంచితో టచ్లో ఉన్నారని కూడా చెప్పారు. దీనిని బట్టి చూస్తుంటే గతంలో టీడీపీలో ఉన్న ఆమంచి ఆ పార్టీకి చెందిన పలువురు కాపు నేతలను వైపీపీలోకి తీసుకు వెళ్లే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.