దేశంలో వాహన చట్టం అమలులోకి వచ్చిన తరువాత జరిమానాలు ఎక్కువయ్యాయి. వాహన చట్టం ప్రకారం జరిమానాలు విధించే విషయంలో పోలీసులు సైతం అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఈ అత్యుత్సాహం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు వేలాది రూపాయలు చలానాలకు కట్టాల్సి వస్తోంది. నెలమొత్తం కష్టపడి సంపాదించిన మొత్తంలో ఎక్కువభాగం ఇలా చలానాలు కట్టాల్సి వస్తుందండటంతో పాపం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
చలానాలు విధిస్తారని తెలిసికూడా వాహనదారులు సరైన పత్రాలు దగ్గర పెట్టుకోకుండా ప్రయాణం చేస్తున్నారు. ఇది దారుణమైన విషయంగా చెప్పాలి. ఇలా వాహనాలను ఇష్టం వచ్చినట్టుగా నడపడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని, దాని నుంచి బయటపడేందుకే ఇలా చట్టాలు తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్తున్నది. ప్రభుత్వం చెప్తున్న మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు.
తాజాగా ఢిల్లీలోని ఐఎస్బిటి బస్టాండ్ దగ్గర పోలీసులు వాహనాలను చెక్ చేస్తున్నారు. పోలీసుల చెకింగ్ లో భాగంగా ఓ మహిళ బైక్ ను ఆపారు పోలీసులు. అన్ని పత్రాలు చూపించింది. అయితే, వాహనం నెంబర్ ప్లేట్ సగం విరిపోయి ఉన్నది. అది మహానేరం. పత్రాలు లేకపోయినా పెద్దగా ప్రమాదం కాదుగాని, నెంబర్ ప్లేట్ లేకుండా లేదంటే.. నెంబర్ ప్లేట్ సగం విరిగిపోయిన వాహనం రోడ్డుమీదకు వస్తే దానికి భారీ జరిమానా విధిస్తారు.
ఢిల్లీలో ఆ యువతికి పోలీసులు జరిమానా విధించేందుకు సిద్ధం అయ్యారు. అయితే, ఆ యువతి వాళ్లతో గొడవకు దిగింది. జరిమానా విధించేందుకు ససేమిరా అన్నది. ఒప్పుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. జరిమానా విధిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అక్కడే పెద్దపెద్దగా అరుస్తూ గందరగోళం సృష్టించడంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు. నెంబర్ ప్లేట్ విరిగిపోయిన వాహనంతో రోడ్డుమీదకు ఎలా వస్తారని ప్రశ్నించారు పోలీసులు. ఆమె మాత్రం పట్టు వదలలేదు. జరిమానా విడిస్తే చచ్చిపోతానని బెదిరించింది. దీంతో ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి పోలీసులు జరిమానా వేయకుండా మందలించి వదిలేశారు.