కోడెలను కేసుల పేరిట సర్కార్ వేధించిందన్న ప్రశ్న తలెత్తే ఛాన్సే లేదు ...
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టిడిపి సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతిని తెలుగుదేశం పార్టీ ( టిడిపి ) రాజకీయం చేస్తుందా?, దానికి ఆయన కుటుంబ సభ్యులు వంత పాడుతున్నారా?? అంటే ప్రభుత్వ లాంఛనాలతో , శివప్రసాదరావు అంత్యక్రియలను నిర్వహించడాన్ని వారు తిరస్కరించడం ద్వారా రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం విన్పిస్తోంది . ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పలు మంత్రిత్వశాఖలు నిర్వహించి, చివరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని వైకాపా సర్కారు నిర్ణయించింది . ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
అయితే శివప్రసాదరావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో కాకుండా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మధ్య నిర్వహించాలని కోడెల కుటుంబం భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరిస్తున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు . వైకాపా సర్కార్ వేధించడం వల్లే తమ తమ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారని కోడెల కుమారుడు, కుమార్తె ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను తిరస్కరించడం ద్వారా పరోక్షంగా చెప్పకనే చెప్పినట్లు అవుతోంది. అయితే నిజంగా వైకాపా సర్కార్ కేసుల పేరిట కోడెల శివప్రసాదరావు వేధించింది అన్న ప్రశ్న ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది .
రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత కోడెల కుటుంబం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్నవారు పోలీసులను ఆశ్రయించారు . టీడీపీ ప్రభుత్వ హయం లో ఫిర్యాదు చేసిన పట్టించుకోని అదే పోలీసులు అధికార మార్పిడి తరువాత బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు . అయితే కోడెల కుటుంబ సభ్యులు ముందస్తుగానే కోర్టు నుండి బెయిల్ పొందడం, కేసు విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధపడడం తో... ఇక కేసుల పేరిట ప్రభుత్వం వేధించిందన్న ప్రశ్నే తలెత్తే అవకాశమే లేదు .