'మోదీ - షా' ద్వయం పక్కా ప్లాన్ తో.. !
గత ఎన్నికలలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి.. టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రెండో సారి అధికారాన్ని దక్కించుకోవడంతో కేసీఆర్ ప్రభుత్వానికి ఇక తిరుగుండదు అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాకా కేసీఆర్ కొత్త వ్యూహాలతో కేంద్రంలో చక్రం తిప్పుదామని ముందుకు వెళ్ళాడు. అయితే ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ బలం పెంచుకుంది. అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచిన, లోక్సభ ఎన్నికలలో మాత్రం అనుకున్న స్థానాలను గెలుచుకోలేకపోయింది. అయితే అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ఒకే ఒక స్థానానికి పరిమితమైన బీజేపీ, లోక్సభ ఎన్నికలలో అనూహ్యంగా పుంజుకుని ఏకంగా నాలుగు స్థానాలను గెలుచుకుంది. దాంతో తెలుగు రాష్ట్రాలలో మరింత పట్టును పెంచుకునేందుకు బీజేపీ ఆకర్ష్ మొదలుపెట్టింది. అటు ఏపీలో ఇప్పటికే టీడీపీనీ వీడి చాలా మంది నేతలు బీజేపీలో చేరిపోయారు. అయితే తెలంగాణలో కూడా టీడీపీ నేతలు, టీఆర్ఎస్ నేతలు పార్టీనీ వీడి బీజేపీలో చేరిపోయారు. అయితే తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ బీజేపీలో చేరేందుకు రెడీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఏపీలో 2009 ఎన్నికలలో టీడీపీ తరుపున గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన అన్నపూర్ణమ్మ 2014 ఎన్నికలలో కూడా టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
అయితే ఈమెతో పాటు మరికొందరు నాయకులు కూడా బీజేపీలో చేరబోతున్నారట. ఈ ఆలోచనతోనే ఆమె బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో అన్నపూర్ణమ్మ భేటీ అయ్యారట. తనతో పాటు బీజేపీలో చేరబోయే నాయకుల తరుపున కూడా ఆమె వాళ్లకు వివరించినట్లు తెలుస్తోంది. వీరంతా త్వరలోనే టీడీపీకి అండ్ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్దమయిపోనున్నారు. మొత్తానికి భారీ విజయంతో మోదీ - షా ద్వయం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక.. ప్రతి రాష్ట్రంలో బీజేపీ అధికారికంలోకి రావాలని ఈ ద్వయం పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బలపడాలనే ఆలోచనతోనే బీజేపీ ఇప్పటికే రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకే ఈ వలసల పక్రియ. ఇప్పటికే తెలంగాణ టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, సురేష్ రెడ్డి, బోడ జనార్దన్ లాంటి వాళ్ళను బీజేపీలో చేర్చుకున్నారు. అలాగే కొంతమంది కాంగ్రెస్ నాయకుల కోసం పావులు కదుపుతుంది. అలాగే రానున్న రోజుల్లో తెరాస నుంచి కూడా భారీగా వలసలు ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ బడా నాయకులతోనే బీజేపీ అగ్ర నాయకత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పట్లో తెరాస నుంచి వలసలు లేకుండా.. ఎన్నికల సంవత్సరం ఉంది అనగా ఒక్కసారిగా బీజేపీలోకి నాయకులు వెళ్లారట.