తెలంగాణ రాజకీయాల్లో రోజు రోజుకు చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించినప్పటి నుంచి ప్రతి రోజు తెలంగాణ రాజకీయాల్లో ఏదో ఒక ఆసక్తికర సంఘటన జరుగుతూనే ఉంటోంది. ఇక మంత్రి వర్గ విస్తరణ టీఆర్ఎస్లో కాక రేపింది. ఒక్కసారిగా అసంతృప్త జ్వాలలు ఎగసిపడ్డాయి. ఇవి చల్లారాయో లేదో ? వెంటనే ఇప్పుడు హుజూర్నగర్ ఉప ఎన్నిక మళ్లీ తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని హీటెక్కించింది.
ఇదిలా ఉంటే తాజా కేబినెట్ ప్రక్షాళనలో చోటు దక్కించుకున్న ఓ మంత్రిని ఇప్పుడు అందరూ ఏకాకాని చేసేస్తున్నారన్న అంశం తెలంగాణ పాలిటిక్స్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర గిరిజన, శిశుసంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ను టీఆర్ఎస్కే చెందిన కొందరు ఎమ్మెల్యేలు దూరం పెడుతున్నారా.. మంత్రి పదవిపై పెట్టుకున్న ఆశలు అడియాశలు కావడంతో మనోవేదనకు గురై, ఆమెను ఒంటరి చేసేం దుకు ప్రయత్నిస్తున్నారా.. అంటే అవుననే తెలుస్తోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, అదే నియోజకవర్గానికి చెందిన సత్యవతిరాథోడ్ సుదీర్ఘకాలంగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. రెడ్యానాయక్ గతంలో చాలాసార్లు మంత్రిగా ఉన్నారు. 2009లో ఆయనకు తొలిసారిగా ఓటమి రుచి చూపించింది సత్యవతి రాథోడ్. ఆమెకు రెడ్యా వియ్యంకుడు వరుస అవుతారు. ఇక కేసీఆర్ కొద్ది రోజుల క్రితం సత్యవతిని ఎమ్మెల్సీని చేసి తాజాగా ఆమెను ఏకంగా తెలంగాణ తొలి మహిళా మంత్రుల్లో ఒకరిగా చేశారు.
ఇక జడ్పీచైర్మన్ పీఠంపై కూడా సత్యవతి తన బంధువు బిందును కూర్చోపెట్టారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఈనేపథ్యంలోనే డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, ఆయన కూతురు, మహబూబాబాద్ ఎంపీ మా లోత్ కవితతోపాటు మానుకోట ఎమ్మెల్యే శంకర్నాయక్ అధిష్టానం వద్ద తమ అంసతృప్తిని వెల్లగక్కారు. వాస్తవంగా శంకర్ నాయక్కు రెడ్యాకు పడదు. అయినా ఇప్పుడు వీరు ముగ్గురు ఏకమై సత్యవతి రాథోడ్ను ఒంటరిని చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న గుసగుసలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వినిపిస్తున్నాయి. మరి ఈ రాజకీయాలు ఎలా మారతాయో ? చూడాలి.