ఒకప్పుడు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలు. కానీ ఈ యేడాది ఎన్నికలతో అదంతా రివర్స్ అయ్యింది. టీడీపీ కంచుకోటలు కూలిపోయాయి. కొన్ని దశాబ్దాలుగా ఆ పార్టీకి ఇక్కడ సంస్థాగతంగా బలం ఉంది. ఈ ఎన్నికల్లో ఆ కంచుకోటలను వైసీపీ అధినేత జగన్ కూకటివేళ్లతో సహా పీకిపడేశారు. ఇక టీడీపీ ఎన్నికల్లో ఓడిపోవడంతో వరుస పెట్టి నేతలు ఇతర పార్టీల్లోకి మారిపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ సారి ఓ బ్యాచ్ మొత్తం టీడీపీకి షాక్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ప్రతి సారి పార్టీ మారినా, నియోజకవర్గం మారినా గెలిచి అధికారంలో ఉండే గంటా అంచనాలు ఈ సారి లెక్క తప్పాయి. 2012 తర్వాత ఫస్ట్ టైం ఆయన మంత్రి పదవికి దూరంగా ప్రతిపక్షంలో ఉన్నారు. గంటాకు అధికారం లేకపోతే రోజు గడవదు అన్నట్టుగా ఆయన వ్యవహారాలు నడుస్తుంటాయ్. ఈ క్రమంలోనే గంటాతో పాటు ఉత్తరాంధ్రలో ఆయన అనుచరగణం అంతా కలిసి వైసీపీలోకి వెళ్లే ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి.
అయితే గంటా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ పార్టీ మారాలన్నదే జగన్ కండీషన్ పెట్టినట్టు తెలుస్తోంది. వైసీపీలో చేరాక ఆయనకు దక్కే అవకాశాలపైనే ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారని సమాచారం. గంటాతో పాటు ఆయన సన్నిహితులు మాజీ ఎమ్మెల్యేలు మీసాల గీత - కేఏ.నాయుడు - టీడీపీలో ఉన్న మరో నేత కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయినట్టు సమాచారం.
ఇప్పటికే ఉత్తరాంధ్రలో అడారి అజయ్ - మాజీ చైర్ పర్సన్ రమాకుమారి - మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసిపాత్రుడు - మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు కూడా వైసీపీలో చేరడానికి రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు గంటాతో పాటు ఓ బ్యాచ్ అంతా వైసీపీలోకి వెళ్లిపోతే చంద్రబాబుకు ఇది మామూలు షాక్ కాదు.