ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. హామీలను అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం కూడా తీసుకోబోతున్నాడు. 2014లో జూన్ 2 వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయింది. ఇలా రెండు రాష్ట్రాలుగా విభజించిన తరువాత ఆంధ్రప్రదేశ్ అవతరణ ఎప్పుడు చేయాలి అన్నది సందిగ్ధంగా మారింది.
రాష్ట్రం విడిపోయింది కాబట్టి జూన్ 2 న నిర్వహించాలా లేదంటే 1956, నవంబర్ 1 వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరించింది కాబట్టి ఆరోజున నిర్వహించాలా అనే విషయంపై నిర్ణయం తీసుకోలేదు. అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అవతరణ విషయంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు జగన్. అయితే, ప్రభుత్వం ఏర్పడి వందరోజులు దాటిపోయింది.
అన్నింటిపై నిర్ణయాలు తీసుకుంటున్నా.. అవతరణ దినోత్సవంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని, వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ మేధావుల ఫోరమ్ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. దీనిపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కాగా, దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈనెల 16 వ తేదీన జరిగే క్యాబినెట్ మీటింగ్ లో దీని గురించి చర్చించబోతున్నారని తెలుస్తోంది.
కాగా, 1956, నవంబర్ 1 వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది కాబట్టి, 1 నవంబర్ వ తేదీనే అవతరణ దినోత్సవంగా నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈనెల 16 వ తేదీన జరిగే క్యాబినెట్ మీటింగ్ లో ఈ తేదీని ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఒకవేళ నవంబర్ 1 వ తేదీని అవతరణ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటే .. దానికి తగిన తగిన నిధులను మంజూరు చేయాలి. ఒకవేళ అవతరణ దినోత్సవం నిర్వహించాలి అనుకుంటే ఎక్కడ నిర్వహిస్తుంది అన్నది తెలియాలి.