తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. పిసిసి అధ్యక్షుడు ఖాళీ చేసిన స్థానం కావడంతో ఇక్కడ ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను ఒక మెట్టు దిగి మరి టిఆర్ఎస్ నేతలను సిపిఐ మద్దతు కోసం పంపారు. చివరకు హుజూర్నగర్ లో టిఆర్ఎస్ కు సపోర్ట్ చేసేందుకు సీపీఐ అంగీకరించిన విషయం తెలిసిందే. కేసీఆర్ మిత్రులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం స్థానికంగా ఉన్న వైసీపీ శ్రేణులను టిఆర్ఎస్ కు సపోర్ట్ చేసేలా ఒప్పించడంలో కెసిఆర్ అయ్యారు.
మరోవైపు సిపిఎం పోటీలో లేకపోవడం కూడా టీఆర్ఎస్కు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ ఎన్నిక కోసం కేసీఆర్ అక్కడ ఏకంగా 70 మంది కీలక నేతలను మోహరించారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మరి ఇంత జరుగుతున్న హుజూర్నగర్ ఫలితంపై ఎందుకు ? ఆందోళన మొదలయింది అంటే ఇందుకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి. కెసిఆర్ ఎన్ని స్కెచ్ లు వేస్తున్నా హుజూర్నగర్ లో మాత్రం స్థానిక సమీకరణలు... పరిస్థితులు టిఆర్ఎస్ కు మరి అంత అనుకూలంగా లేవన్న మాట వినిపిస్తోంది.
ఇప్పటికే రెండుమూడుసార్లు గ్రౌండ్ రిపోర్ట్ తప్పించుకున్న కేసీఆర్ క్షేత్రస్థాయిలో మరింతగా దృష్టి పెట్టాలని ఎన్నికల ఇన్చార్జి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు... జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి కి సీరియస్ గా చెప్పినట్టు తెలుస్తోంది. దాదాపు పది రోజులుగా టీఆర్ఎస్ ఇన్ఛార్జులంతా హుజూర్నగర్లో మకాంవేసి, మండలాల వారీగా ప్రచారం నిర్వహిస్తూ, పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు హైకమాండ్కు రిపోర్టులు పంపిస్తున్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై సొంత పార్టీ నేతల్లోనే వ్యతిరేకత ఉందంటున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఇక అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను పక్కన పెట్టడంతో బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. సైదిరెడ్డి కంటే ఉత్తమ్ ఫ్యామిలీయే అందరిని కలుపుకుని పోతుందన్న లెక్కలు ఉన్నాయి. ఇక ఆంధ్రా బోర్డర్ కావడంతో ఆ ప్రభావం కూడా ఉంది. టీడీపీ పోటీతో కొన్ని వర్గాల ఓట్లు టీఆర్ఎస్కు పడే పరిస్థితి లేదు. కేసీఆర్తో రెండు మూడు సభలు నిర్వహిస్తేనే పరిస్థితి ఏమైనా మారొచ్చని, లేదంటే గడ్డు పరిస్థితేనని హుజూర్నగర్ టీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు.