గ్రామాల్లో పచ్చదనం-పరిశుభ్రత పెంచడమే లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ (పల్లె ప్రగతి) దిగ్విజయంగా అమలయిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అన్ని గ్రామాల్లో పవర్ వీక్ నిర్వహించి, విద్యుత్ సంబంధిత సమస్యలు పరిష్కరించడంలో విద్యుత్ శాఖ అద్భుతంగా పనిచేసి, అన్ని శాఖల్లో కెల్లా నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మంత్రులు, కలెక్టర్లు, డిపిఓలు, డిఎల్పిఓలు, ఎంపిఓలు, గ్రామ కార్యదర్శులు, సర్పంచులకు సిఎం అభినందనలు తెలిపారు.
ఇదే స్పూర్తిని కొనసాగించాలని సిఎం పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధికి నెలకు రూ. 339 కోట్లు విడుదల చేయాలని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్లు, డిపిఓలు, డిఎల్పీఓలు, ముఖ్య కార్యదర్శుల సమావేశం గురువారం ప్రగతి భవన్ లో జరిగింది. ప్రతీ జిల్లా కలెక్టర్ 30 రోజుల కార్యక్రమం అమలులో అనుభవాలను కేసీఆర్ కు వివరించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు సమిష్టి ప్రణాళిక, సమిష్టి కార్యాచరణ, సమిష్టి అభివృద్ధి అనే ఆశయాలతో కార్యక్రమం నిర్వహించినట్లు కలెక్టర్లు వెల్లడించారు.
పల్లె ప్రగతి కార్యక్రమంతో మంచి ఫలితం వచ్చిందని, మన ఊరిని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన ప్రజల్లో వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ స్పూర్తిని కొనసాగించడానికి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రామాలు బాగుపడాలనే ఉద్దేశ్యంతో గ్రామ కార్యదర్శి నుంచి జిల్లా పంచాయతీ అధికారి వరకు అన్ని ఖాళీలను భర్తీ చేసినట్లు సిఎం వెల్లడించారు. గ్రామ పంచాయతీలకు నిధుల కొరత రానివ్వబోమని చెప్పారు.
గ్రామ పంచాయతీలకు సమకూరే సొంత ఆదాయానికి 339 కోట్లు అదనమని సిఎం అన్నారు. చెట్లు పెంచే పనులకు, చెత్త ఎత్తేవేసే పనులకు నరేగా నిధుల వాడుకోవాలని సూచించారుజిల్లా పంచాయతీ అధికారులు ప్రధాన బాధ్యత తీసుకుని, నిధులను సక్రమంగా వినియోగించుని, గ్రామాల్లో మార్పు తీసుకురావాలని కోరారు. గ్రామ స్థాయిలో రూపొందించిన వార్షిక, పంచవర్ష ప్రణాళికలకు అనుగుణంగా పనులు జరగాలని చెప్పారు.