కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ర్యాలీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశం చూపును తనవైపు తిప్పుకొంటున్న రెండు ముఖ్యమైన రాష్ట్రాల విషయంలో ఆమె చివరి నిమిషంలో తన ఆలోచన విరమించుకున్నారు. 288 స్థానాలున్న మహారాష్ట్ర, 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి ఈ నెల 21వ తేదీన పోలింగ్ జరగనుంది. 24వ తేదీన ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో ఆయా పార్టీల ప్రముఖ నేతలంతా తుదిదశ ప్రచారాల బాట పట్టారు. అయితే, హర్యానాలోని మహేందర్ఘర్లో సోనియాగాంధీ పర్యటనను హఠాత్తుగా రద్దు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వివిధ పరిణామాల నేపథ్యంలో...ఆగస్టు నెలలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను సోనియా తాత్కాలికంగా స్వీకరించారు. కీలకమైన హర్యానాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సోనియా ప్రచారం చేస్తుందని ఆశించారు. మహారాష్ట్రలో కూడా సోనియా ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం టైమ్ కూడా ఫిక్స్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల ర్యాలీని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు మహారాష్ట్ర ప్రచారసభకు సోనియా వెళ్తారా లేదా అన్న విషయంలో... ఇంకా డైలమా కొనసాగుతోంది.
మహారాష్ట్ర, హర్యానాలో రాహుల్ కీలక ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హర్యానాలో రద్దయిన సోనియా ప్రచారానికి బదులుగా రాహుల్ మాట్లాడనున్నట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. కొత్త ట్వీట్లో కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని చెప్పింది. మరోవైపు ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రచారం ముగియనుండటంతో... చివరి విడత ప్రచార షెడ్యూల్ ఖరారు చేసుకుంటున్నారు. బీజేపీ రథసారథి ప్రధాని మోదీ మహారాష్ట్ర, హర్యానాలో, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా షెడ్యూల్లు ఇప్పటికే ఖరారు అయ్యాయి.హర్యానాలోని మొహానా, హిసర్ బహిరంగ సభల్లో ప్రధాని, మహారాష్ట్రలోని అహేరీ, రాజురా, వాని, ఖాసర్ఖెడా ర్యాలీల్లో అమిత్షా పాల్గొననున్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం హర్యానాలోని మహేంద్రఘర్ బహిరంగ సభలో కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు.