ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కీలక నిర్ణయాలు, ప్రాజెక్టుల రివర్స్ టెండర్లు.. ఏపీకి ప్రత్యేక హోదా సాధన, నిధుల కేటాయింపు, రాజధాని నిర్మాణం.. వంటి అనేక అంశాల విషయంలో కేంద్రంతో ఎడతెగని చర్చలు జరుపుతూనే ఉన్నారు. అయితే, ఇప్పటి వరకు ఈ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడం గమనార్హం. అయినప్పటికీ జగన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నిజానికి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంకా సీఎంగా ప్రమాణం చేయకముందుగానే ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వచ్చారు జగన్. ఈ క్రమంలోనేఆయన రాష్ట్ర సమస్యలను వివరించారు.
విభజన కష్టాలతో ఉన్న ఏపీకి ఉదారంగా సాయం చేయాలని కోరారు. అదేసమయంలో ఏపీ ప్రజల కలలా ఉన్న ప్రత్యేక హోదా అంశాన్ని కూడాఆయన ప్రస్థావించారు. ఇక, ఇదే విషయాన్ని హోం మంత్రి, బీజేపీ సారథితోనూ పలుమార్లు జగన్ వెల్లడించారు. ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డితోనూ రాయబారం పంపారు. అయితే, దీనిపై ఇప్పటి వరకు అటు మోడీ కాని, ఇటు షా కానీ స్పందించలేదు.
ఇదిలావుంటే, తాజాగా పోలవరం రివర్స్ టెండర్లు, సౌర, పవన విద్యుత్లకు సంబంధించిన పీపీఏల విషయంలో జగన్ అనుసరిస్తున్న విధానంపై కేంద్రానికి పలు ఫిర్యాదులు అందాయి. ఇటు ప్రతిపక్షం టీడీపీ, అటు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా పీపీఏలు, రివర్స్ టెండర్ల విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాల ను వారు ఫిర్యాదుగా చెప్పుకొచ్చారు. దీంతో ఈ రెండు విషయాల్లోనూ కేంద్రం సీరియస్గానే ఉంది. ముఖ్యంగా పీపీఏల విషయంలో గుజరాత్(మోడీ సొంత రాష్ట్రం)కు చెందిన బడా వ్యాపారులు ఉండడం, జగన్ నిర్ణయంతో వారికి నష్టం చేకూరే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వీటిపై కేంద్రం సీరియస్గా ఉన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ రెండు విషయాలు సహా .. ఇటీవల తాను ప్రారంభించిన వైఎస్సార్ రైతు భరోసా పథకానికి కేంద్రం పేరును కూడా పెట్టిన విషయం ఈ సందర్భంగా మోడీతో చర్చించే అవకాశం ఉంది. మరి ఇప్పటికైనా జగన్ పర్యటన సక్సెస్ అవుతుందా? ఆయన వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులకు కేంద్రం సహకారం అందిస్తుందా? వేచి చూడాల్సిందే.