నేను మార్కులు వేసేంత నిపుణుడిని కాదు.. ఎందుకో నిజాయితీ ప్రభుత్వం అన్న ఫీలింగ్ జనాల్లోకి వెళ్ళింది.. ఎవరో ఒకరిద్దరు మంత్రులు లంచం తీసుకుంటే తిరిగి ఇప్పించాడన్న వార్తలు వచ్చాయి.. పైగా తాను కొందరు అధికారులు, ఎమ్మెల్యేలతో మాట్లాడితే వారందరు అవినీతి లేదు అని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మంచి సంకేతం.. ఇక మార్కులు అంటారా.? జగన్మోహన్ రెడ్డి.. రాజశేఖర్ రెడ్డి కొడుకు అది మనసులో ఉన్నంతకాలం నేను ఫెయిర్ గా మార్కులు వెయ్యలేను.. అని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నమ్మిన నేతల్లో ఒకరైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్కుమార్ చేసిన ఈ వ్యాఖ్యాలతో ఏపీలో జోరుగా రాజకీయ చర్చ జరుగుతోంది.
ఓ ప్రముఖ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఉండవల్లి అరుణ్కుమార్ ఏపీ సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యాలు చేశారు. వాస్తవానికి మొదట్లో జగన్ ప్రభుత్వానికి ఆయన సహాచరుల నుంచే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ సంచలనం సృష్టించారు. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లోనే ఏపీలో టాప్ లెవల్లో అవినీతి కంట్రోల్ అయిందన్న భావన కలుగుతుంది... అన్యాయంగా ఆరోజు పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించినప్పుడు రాష్ట్రంలోని ఏ పార్టీ నోరు మెదపలేదు.. పైగా ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 ని రద్దు చేసిన విధానం బాగోలేదని ప్రశ్నించిన కాంగ్రెస్ ను, ఏపీని మీరు ఏ విధంగా విభజించారు అని ప్రధాని మోదీ ఎదురు ప్రశ్నించినప్పుడు కూడా మనవాళ్ళు ఎవరూ మాట్లాడలేదన్నారు.
భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ అవసరం దేశానికీ ఉందన్న ఉండవల్లి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలించే పార్టీ అని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు ఉండవల్లి. ఏదేమైనా ఉండవల్లి అరుణ్కుమార్ అటు ఏపీ సీఎం వైఎస్ జగన్ పైనా, ఆయన పరిపాలన పైనా, కాంగ్రెస్ పార్టీపైనా నిర్మోహమాటంగా చెప్పిన అభిప్రాయం ఇప్పుడు వైరల్ అవుతోంది.