ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూర్నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైడిరెడ్డి గెలుపొందిన నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ..ఆయన సమ్మెపై మీడియా అడిగిన ప్రశ్నలకు సుదీర్ఘంగా వివరించారు. సమ్మెపై చర్చల విధానాన్ని తాము వదిలిపెట్టలేదని..కార్మికులే దాన్ని వదులుకున్నారని కేసీఆర్ వివరించారు. ఆర్టీసీ సమ్మె ముగింపు ఎలా ఉండనుందని మీడియా ప్రశ్నించగా...``ఇక ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు. అయిపోయిందని.. ఆర్టీసీ దివాళా తీసింది.సమ్మె ముగింపు కాదు...ఇక ఆర్టీసీనే ముగుస్తుంది. ``అని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.
వెయ్యి శాతం పాత ఆర్టీసీ ఉండదని కేసీఆర్ స్పష్టం చేశారు. యూనియన్లు ఇలా ఉంటే ఆర్టీసీ కార్మికుల మనుగడ ఉండే అవకాశం లేదని తేల్చిచెప్పారు. ఐదారు రోజుల తర్వాత ఆర్టీసీపై ఫైనల్ నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీపై కేబినెట్ నిర్ణయం అవసరం లేదని...ఒక్క సంతకంతో ఐదారువేల ప్రైవేటు బస్సులు వచ్చే అవకాశం ఉందన్నారు. సీఎంగా చెప్తున్న...ఆర్టీసీకి వందశాతం భవిష్యత్ ఉండదు అని తేల్చిచెప్పారు. కార్మికులను యూనియన్లు చెడగొడుతున్నాయని మండిపడ్డారు. కోర్టు కేసు ఆధారంగానే...తుది నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఇతర సమస్యలను సున్నితంగా పరిష్కరించామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. `రాష్ట్రంలో నేడు విద్యుత్ సమస్య లేదు. ఐదారు నియోజకవర్గాలు తప్పిస్తే రాష్ట్రంలో నేడు ఎక్కడా తాగునీటి సమస్య లేదు. సాగునీటి రంగంలో సమస్యలు పరిష్కరించాం. కాళేశ్వరం దాదాపు పూర్తికావొస్తుంది. పాలమూరు ఫుల్ స్పీడ్తో సాగుతుంది. సీతారామ పూర్తి కావొచ్చింది. దేవాదుల 90 శాతం పూర్తియింది. ఈ నాలుగు ప్రాజెక్టులు పూర్తైతే తెలంగాణ సాగునీటి రంగం అద్భుతంగా ఉంటుంది. ఆ దిశగానే పయనిస్తున్నాం. సింగరేణిలో సైతం పరిష్కరించాం. ఆర్టీసీ సహకరిస్తే...వారికి సైతం కార్మికులకు లక్ష రూపాయలు బోనస్ ఇచ్చే విధంగా ఎదుగుతుంది`` అని వెల్లడించారు.