మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ దుమ్ములేపింది. గెలిచిన స్థానాలను పక్కన పెడితే .. ఓట్లను చీల్చడం ద్వారా మిగిలిన పార్టీల గెలుపోటములను శాసించింది. ఈ ఎన్నికల్లో మైనార్టీ ఓట్లను చీల్చడం ద్వారా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమైంది. 44 స్థానాల్లో మజ్లిస్ పార్టీ అభ్యర్థులు మిగిలిన అభ్యర్థుల కంటే ఎక్కువగా ఓట్లు పొందారు. గతంలో మైనారిటీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకే పడేవి.
తాజాగా జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున పోటీకి దిగి.. గట్టిగా ప్రచారం చేయడంతో కాంగ్రెస్కు నష్టం తప్పలేదు. ఆ పార్టీ ఓటుబ్యాంకుగా ఉన్న మైనార్టీల ఓట్లు ఎక్కువగా మజ్లిస్ కు పడటం. బీజేపీ-శివసేన కూటమికి లాభించింది. ఈ దెబ్బతో కాంగ్రెస్కు పట్టున్న కొన్ని స్థానాల్లోనూ బీజేపీ కూటమి సునాయసంగా గెలిచింది.
మరాఠ్వాడాలోని మైనారిటీ ఓట్లను ఏకతాటిపైకి తేవడంలో ఆ పార్టీ విఫలమైన పరిస్థితి కనిపిస్తోంది. చాలాస్థానాల్లో కాంగ్రెస్ విజయ అవకాశాలకు మజ్లిస్ గండికొట్టింది. ఓటర్లు మజ్లిస్ వైపు మొగ్గడం కాంగ్రెస్ను దెబ్బతీసింది. దీంతో ఆ పార్టీ రెండోస్థానానికి పడిపోయింది. గతంలో గెలుచుకున్న స్థానాలను కూడా కోల్పోయింది. ఒకవైపు బీజేపీ-శివసేన కూటమి మరోసారి బంపర్ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకోగా.. మరోవైపు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా మంచి ప్రదర్శన కనబరిచింది. అటు పట్టున్న స్థానాలు కూడా కోల్పోయి కాంగ్రెస్ చతికిలపడింది.
ఈ ఎన్నికల్లో ఔరంగాబాద్ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ సంచలనం నమోదు చేసింది ఈ నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 80శాతానికి ఓట్లు ఎంఐఎం అభ్యర్థికి దక్కడం విశేషం. గతంలో తక్కువ స్థానాల్లో పోటీ చేసిన మజ్లిస్ పార్టీ ఈసారి పూర్తిస్థాయిలో పోటీ చేసిన దాదాపుగా కొన్ని స్థానాల్లో తమ ప్రభావం చూపించగా.. మరికొన్ని స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ కు దెబ్బేసిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు