సుజనా చౌదరికి ఎసరు పెడుతున్న బీజేపీ, వైసీపీ నేతలు..?
సుజనాచౌదరి.. ఓ రాజ్యసభ సభ్యుడు.. ఏనాడు క్షేత్ర స్థాయిలో రాజకీయాలు చేయకపోయినా.. పారిశ్రామికవేత్తగా ఉన్న పలుకుబడి ధనబలంతో ఏకంగా కేంద్రమంత్రి అయిపోయిన నాయకుడు.. అంతే కాదు.. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన టీడీపీకి కష్టకాలంలో గుడ్ బై చెప్పి బీజేపీలోకి వెళ్లిపోయిన నేత.. ఇప్పుడు ఏపీ బీజేపీలో సుజనాచౌదరి కీలకపాత్రధారి అయ్యారు.
ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి సైతం అసూయ కలిగేలా సుజనా చౌదరికి ప్రాధాన్యం లభిస్తోంది. దీనికితోడు ఆయన వైఖరి కూడా సొంత పార్టీ నేతలకు అసంతృప్తి కలిగిస్తోంది. బీజేపీలో చేరినా ఇంకా ఆయన చంద్రబాబు శిష్యుడి వైఖరినే అవలంభిస్తున్నారన్న వాదన ఉంది. అందుకే బీజేపీ, వైసీపీ నాయకులు సుజనా చౌదరిపై గుర్రుగా ఉన్నారు. వైసీపీ నాయకుడు, ఎంపీ బాలశౌరి ఏకంగా పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తానంటున్నారు.
సుజనా చౌదరి డూప్లికేట్ బీజేపీ నేత అని ఎంపీ బాలశౌరి అన్నారు. సుజనాకు సూటిగా ప్రశ్నలు సంధించారు. సుజనా బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా..? మీకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా..? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా..? ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ధర్మదీక్షలు చేసింది నువ్వు కాదా సుజనా అని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా – సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి భేటీ గురించి నిజమైన బీజేపీ నేత జీవీఎల్ నర్సింహారావు వివరించారన్నారు.
సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నాడన్నారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా మాటలకు విలువ లేదన్నారు. సుజనా చౌదరిపై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తానన్నారు. ఇప్పటికే జీవీఎల్ కూడా సుజనాపై ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెడతామన్నారు. మరి ఈ ఫిర్యాదు ప్రభావం ఎలా ఉంటుందో..?