ఆ బాధ చెప్పుకోలేనిది.. ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియదు.. ఎవ్వరు తీర్చుతారో అర్థం కాదు.. ఏమని చెప్పాలో అంతకన్నా బోధపడదు.. బోధించేవారి బాధ కూడా అదే.. వారు ఎవ్వరికి చెప్పుకోలేక.. తాము ఆ బాధ భరించలేక అలాగే కాలం గడుపుతున్నారు. కానీ మీడియా ఊరుకుంటుందా... మీడియా ఆ బాధను బట్టబయలు చేసింది.. సర్కారు చేస్తున్న అసత్వాన్ని నిగ్గు తేల్చింది. సర్కారు పెద్దలకు దిమ్మ తిరుగలేదు.. బుర్రకు ఎక్కలేదు.. ఇక మా బాధను పట్టించుకునేవారు లేరు అనుకున్నారు ఆ అభాగ్యులు. కానీ కొందరు కనికరించారు.. కరుణ చూపారు.. జాలీ పడ్డారు.. ఆ బాధను తీర్చేందుకు ఆపన్న హాస్తం అందించేందుకు సిద్దమయ్యారు.
సమస్య ఎక్కడి అన్నది సమస్య కాదు.. ఎవ్వరు మానవత్వంతో తీర్చారన్నదే ముఖ్యం అనుకున్నారు ఆ నేత. వెంటనే తాను ఆ సమస్య తీర్చేందుకు సన్నద్ధమయ్యారు. రంగంలోకి దిగారు. ఆ బాధను తీర్చేందుకు నడుం భిగించారు. వాస్తవానికి అది తన పరిధి కాదు. తన రాష్ట్రం అంతకన్నా కాదు. పొరుగు రాష్ట్రంలోని సమస్య అది. తన ఓటర్లు అంతకన్నా కాదు. అయినా తపించే హృదయం ఉంది. స్పందించే గుణం ఉంది. అందుకే స్పందించారు. ఆయనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి.
సమస్య తెలంగాణ రాష్ట్రానిది. తాను మాత్రం ఏపీకి చెందిన ఎమ్మెల్యే. కానీ స్పందించే గుణం ఉంది. సాయం చేసే చేతులున్నాయి. అందుకే ఓ దినపత్రికలో చెప్పుకోలేని బాధను ముగింపు పలుకాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం మహబుబాబాద్ జిల్లా గూడూరు జడ్పీ పాఠశాల. అక్కడి బడిలో చదువుకునేది ఎక్కువ మధ్య, పేద తరగతి విద్యార్థులే. దాదాపుగా 180 మంది బాలికలు ఆ బడిలో చదువుకుంటారు. కానీ వారికి ఒకే టాయిలెట్ ఉంది. దీంతో విద్యార్థులు తమ సమస్య తీర్చుకునేందుకు క్యూ కట్టాల్సిందే. ఇది దినపత్రికలో రావడంతో స్పందించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెంటనే తాను టాయిలెట్ల నిర్మాణంకు రూ.1.75లక్షలు ఆర్థిక సాయం అందించారు.
ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న తెలంగాణ ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ తన రాజ్యసభ నిధుల నుంచి నిధులు ఇచ్చేందుకు సిద్దమని ట్వీట్టర్ వేధికగా ప్రకటించారు. ఇక కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్రెడ్డి వెంటనే స్పందించి సమస్య తీవ్రతపై వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇక మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణలో మరే పాఠశాలలో ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఒక్క వార్త మొత్తం సమాజాన్ని, సర్కారును, ప్రజాప్రతినిధులను కదలించింది.