జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇసుక సమస్యపై స్పందించిన తీరు,
లాంగ్ మార్చ్ నేపథ్యంలో...వైఎస్ఆర్సీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా
ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ మీడియాతో మాట్లాడుతూ...పవన్పై మండిపడ్డారు. చంద్రబాబుతో కలిసి పవన్
కళ్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపించారు. ``ఇసుకకు సంబంధించి ఈ రాష్ట్రంలో తాత్కాలిక ఇబ్బంది ఉందనేది అందరికీ తెలిసిందే. దానికి కారణాలు ఏమిటీ అనేది ప్రతిపక్ష పార్టీలకి అర్థం కాకపోవడం బాధాకరం.`` అని ఆయన అన్నారు. కృత్రిమంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే ఇసుక కొరతను సృష్టించదనే విధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
``రాష్ట్రంలోని నదులు ప్రస్తుతం ఏ రకంగా ప్రవహిస్తున్నాయో ప్రజలకు తెలుసు. పొంగి ప్రవహిస్తున్న నదుల నుంచి ఇసుకను తవ్వి తీయడం సాద్యం కాదని ప్రజలకు తెలుసు. ఒక్కసీటు గెలిచిన చిన్నపిల్ల సేనకు, ఇరవై మూడు సీట్లు గెలిచిన ఇంకుడు గుంతల దేశంకు ఈ విషయం తెలియడం లేదా? ఇసుక కోసం అంటూ పవన్
లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చారు. పవన్
కళ్యాణ్ సినిమాల్లో నటించేప్పుడు అనేక బ్యానర్లు, ప్రొడక్షన్లలో పనిచేశారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఒకటే బ్యానర్ ను ఎంచుకున్నారు. అదే నారా వారి ప్రోడక్షన్. ఇప్పుడు ఆ బ్యానర్లోనే ఆయన ప్యాకేజీలు నడుస్తున్నాయి. మీరు సినిమాలు ఎందుకు మానేశారో మొదట్లో ఎవరికీ అర్థం కాలేదు. మీ కాల్ షీట్ల కోసం పెద్దపెద్ద ప్రొడ్యూసర్లు తిరుగుతున్నారు. అయినా సినిమాలను వదులుకున్నారంటే.. చంద్రబాబు ఇచ్చే కాల్షీట్లు, రెమ్యునరేషన్ ఎక్కువ కాబట్టే అని అర్ధం అవుతోంది. పవర్ స్టార్ నుంచి మీరు ప్యాకేజీ స్టార్ గా మారిపోయారు. అందుకే గత ఎన్నికల్లోనే పవన్ కు ప్రజలు బుద్ది చెప్పారు.`` అని మండిపడ్డారు.
ఇసుకను జాతీయ సమస్యగా చిత్రీకరించి, రాజకీయంగా లబ్దిపొందాలని చూడటం బాధాకరమని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ``ఈ రాష్ట్రంలో జగన్
ముఖ్యమంత్రి అయితే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని బహిరంగంగా చెప్పారు. వైఎస్ జగన్ ఈ రాష్ట్రానికి సీఎం అవ్వడం కల అని కూడా పవన్
కళ్యాణ్ చెప్పారు. మరి పవన్
కళ్యాణ్ ఇప్పుడు తన కొత్త పేరు ఎప్పుడు చెబుతారు? మీ పేరు నారా పవన్ కళ్యాణ్ అని మార్చుకుంటారా? రెండు లక్షల పుస్తకాలు చదివిన వ్యక్తిగా... తన పుస్తకాల్లోని మంచి పేరును ఆయన ఎప్పుడు పెట్టుకుంటారు.?`` అని ఎద్దేవా చేశారు.
విశాఖలో
లాంగ్ మార్చ్ ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారని అమర్ నాథ్ ప్రశ్నించారు. రేపు జరిగే
లాంగ్ మార్చ్ జనసేనకు లాస్ట్ మార్చ్ అవుతుందని ఆయన అన్నారు. ``ఎన్నికల్లో పరాజయం చెందిన తరువాత గాజువాక ప్రజలకు కనీసం ఏ ఒక్కరోజు అయినా కృతజ్ఞతలు తెలిపారా?
జనసేన ఎందుకు ఓడిందనే సమీక్షా సమావేశం ఏనాడైనా విశాఖలో పెట్టారా? ఈ సమావేశం పెట్టి ఉంటే... మీ పార్టీ పరిస్థితి ఏమిటో తెలిసేది.
విశాఖ జిల్లాకు చెందిన కీలకనేత బాలరాజు జనసేనను వదులుతున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. మీ సైన్యం జారిపోతున్నా...పట్టించుకోకుండా... మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబే. ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. `` అని అన్నారు.
దేశంలో ఎప్పుడూ లేని విధంగా అన్ని వర్గాలకు వైఎస్ఆర్సీపి ప్రభుత్వం మేలు చేస్తోందని అమర్నాథ్ తెలిపారు. ``ఒక్క ఏపీలోనే కాకుండా పక్కరాష్ట్రాల్లో కూడా ఆరోగ్య శ్రీని అమలు చేస్తూ
ముఖ్యమంత్రి వైఎస్
జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మీరు ఉద్దానం... ఉద్దానం అని తిరిగి ఏం ఉద్దరించారు? అటువంటి ఉద్దానంకు వైఎస్ జగన్ సిఎం అయిన యాబై రోజుల్లోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. డయాలసిస్ పేషంట్లకు పెన్షన్లను ప్రకటించారు. కేవలం రాజకీయ లబ్దికోసమే మీరు
లాంగ్ మార్చ్ అంటున్నారు. గత అయిదేళ్లలో ఇసుక దోపిడీ చేసిన అచ్చెన్నాయుడు
టీడీపీ నుంచి
లాంగ్ మార్చ్ లో పాల్గొంటున్నారు. ఇసుక మాఫియా డాన్ అచ్చెన్నాయుడు, డ్రగ్ మాఫియా డాన్ అయ్యన్నపాత్రుడు, లిక్కర్ మాఫియా డాన్ లను పక్కన పెట్టుకుని
లాంగ్ మార్చ్ చేస్తారా? మహనీయుల పేర్లు చెబుతారు... గొప్ప పుస్తకాలు చదివానంటారు...మీరు చేసే పనులకు వీటికి ఏమైనా పొంతన ఉందా పవన్ కళ్యాణ్?`` అని ప్రశ్నల వర్షం కురిపించారు.
``చంద్రబాబు ఉస్కో అంటే...పవన్ ఇసుకో అని అంటున్నాడు.
లాంగ్ మార్చ్ పోరాటాల పేరుతో రాజకీయ ప్రయోజనం పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీ వ్యక్తిగత జీవితంలోనూ, రాజకీయ జీవితంలోనూ మీది షార్ట్ మార్చే. మీరు తీసుకునే నిర్ణయాల మీద మీకున్న నిబద్దత ప్రజలకు తెలుసు. లాంగ్ అనే మాటను
పవన్ కళ్యాణ్ విరమించుకోవాలి. సినిమాల్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ లాంగ్ మీకు నచ్చదు. ఇసుక విషయంలో లాంగ్ అనే పదం ఎందుకు వచ్చిందో మాకు అర్ధం కావడం లేదు. ప్రతిపక్షంగా అర్థవంతమైన విమర్శలు చేస్తే స్వీకరించేందుకు సిద్దంగా వున్నారని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబుతో కలిసి చేసే ఇటువంటి బురద జల్లుడు పనులను మానుకోండి.`` అని సూచించారు.