మహారాష్ట్రలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తారో తెలియడం లేదు. అక్టోబర్ 21 వ తేదీన ఎన్నికలు ముగిసి, అక్టోబర్ 24 వ తేదీన రిజల్ట్ వచ్చిన తరువాత రాష్ట్రంలో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాలేదు. మాములుగా మహారాష్ట్రలో అధికారం చేపట్టడానికి 145 మంది సభ్యులు అవసరం. కూటమిలో భాగంగా బీజేపీ, శివసేనలకు ఆ మెజారిటీ ఉన్నది.
కానీ, శివసేన తనకు ముఖ్యమంత్రి పీఠం కావాలని మెలికపెట్టడంతో బీజేపీ వెనక్కి తగ్గింది. ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధంగా లేనట్టు చెప్పింది. దీంతో శివసేన పార్టీ బీజేపీ కి మద్దతు ఇచ్చేందుకు ససేమిరా అన్నది. దీంతో ఆ పార్టీ ఇరకాటంలో పడింది. ఎలాగో మెజారిటీ లేదు. పైగా శివసేన మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదని చెప్పింది.
ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో ఉన్న శివసేనకు గవర్నర్ నుంచి ఆహ్వానం అందింది. శివసేన చాలా హ్యాపీగా ఫీలైంది. ముఖ్యమంత్రి పదవి రాబోతుందని. అసలు సమస్య ఇక్కడే ఉన్నది. మహారాష్ట్ర నుంచి ముంబైకు మకాం మార్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శివసేనకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా లేరని తెస్తోంది. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధినేత కూడా శివసేనకు సపోర్ట్ చేయడానికి ఇష్టపడటం లేదు.
తాము ప్రతిపక్షంలోనే ఉంటామని, శివసేనతో కలిస్తే.. దానివలన ఇబ్బందులు వస్తాయని అంటోంది. మైనారిటీ, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ తగ్గిపోతుందని, దాని వలన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే ఛాన్స్ తగ్గిపోతుందని అలోచించి కాంగ్రెస్ పార్టీ సైలెంట్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాతో మాట్లాడేందుకు ఎన్సీపీ అధినేత శరత్ పవార్ సిద్ధం అవుతున్నాడు. ఒకవేళ ఆమె కాదంటే మద్దతు ఇవ్వడానికి ఎన్సీపీ కూడా ఒప్పుకోదు. ఆ సమయంలో శివసేన పరిస్థితి ఏంటి అన్నది చూడాలి.